బాన్సువాడ/ బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 2: సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలో పర్యటించి కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పట్టణంలోని ఒకటో వార్డు, మినీ ట్యాంక్బండ్ పరిసరాల్లో రూ. నాలుగు కోట్లతో చేపట్టిన మల్టీజనరేషన్ పార్క్, చిల్డ్రెన్ పార్కు పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. పార్కులను రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మించాలని సూచించారు. పార్కులో ప్రకృతి వైద్యం అందేవిధంగా కొత్త తరహాలో ఆక్యుప్రెషర్ పాత్ వాకింగ్ ట్రాక్ను ఏర్పాటుచేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పట్టణంలో పర్యటిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని చూసి ఫాతిమా అనే మహిళ రోడ్డుపైకి వచ్చింది. తమకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేసినందుకు రెండుచేతులు జోడించి ధన్యవాదాలు తెలిపింది. జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొంది.అనంతరం ఆమె యోగక్షేమాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు.
పర్యటనలో భాగంగా స్పీకర్ ఓ చెట్టు నీడలో కూర్చొని పలు అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆర్డీవో రాజాగౌడ్, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎండాకాలం పూర్తయ్యేలోపు అభివృద్ధి పనులు పూర్తికావాలన్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల, వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు. అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం అటుగా వెళ్తుండగా కల్కి చెరువు కింద అలుగులో స్నానమాడుతున్న చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.
ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారుచేయాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం స్పీకర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ.. రూ.కోట్లు పెట్టినా దొరకనివి అమ్మ పాలు అని పేర్కొన్నారు. ముర్రుపాలు పిల్లల జీవితాలకు అమృతం అని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది కలిసి ఒక సమితిగా ఏర్పడి తల్లులకు అందించిన తల్లి పాల ప్రాముఖ్యతను వివరించడంతో బాన్సువాడ ప్రభుత్వ వంద పడకల మాతా-శిశు దవాఖానకు దేశవ్యాప్త ఖ్యాతి దక్కిందన్నారు. ప్రపంచ, జాతీయ ఆరోగ్య సంస్థలు ఏడాది పాటు నిర్వహించిన సర్వేలో బాన్సువాడకు బ్రెస్టు ఫీడింగ్ ఫ్రెండ్లీ అవార్డు వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేసిన వారమవుతామన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్డు, పాలు, ఆకు కూరలతో కూడిన పౌష్టికాహారం అందజేస్తున్నదని చెప్పారు. తల్లి, పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ కిట్, న్యూట్రిషిన్ కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే బాన్సువాడలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి నూతన భవనం నిర్మిస్తామని, దానిపై అంగన్వాడీ యూనియన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.