మందు లేని మహమ్మారి ఎయిడ్స్ తగ్గుముఖం పట్టింది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి వ్యాప్తి నిరోధానికి సర్కారు చేసిన ప్రయత్నం ఫలిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవీ జాడ తగ్గిపోతున్నది. మరోవైపు, ఎయిడ్స్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటున్నది. వైద్యంతో పాటు పింఛన్లు అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నది. నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఎయిడ్స్కు మందులేదు.. నివారణ ఒక్కటే మార్గం.. ఎయిడ్స్పై జరిగే అవగాహన కార్యక్రమాల్లో ముందుగా వినిపించే మాట ఇది. ప్రపంచాన్ని వణికించే వ్యాధుల్లో ఎయి డ్స్ దే అగ్రస్థానం. నివారణ తప్ప నిర్మూలన లేని వ్యాధి ఇది. ఈ వ్యాధిపై అవగాహన కోసం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. శారీరకంగా దృఢమైనప్పటికీ విచ్చలవిడితనం, పట్టింపులేనితనం మూలంగా జరిగే శృంగార కార్యకలాపాలతో ప్రాణాంతకమైన మహమ్మారి కోరల్లో చిక్కుకొని విలవిల్లాడడమే పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా? అన్న ప్రకటనలోని సారాంశం. ప్రజల్లో విస్తృతమైన ప్రచారానికి వినూత్నమైన ప్రకటన కాసింత దోహదం చేసింది. సరిగ్గా దశాబ్దన్నర క్రితం ప్రపంచాన్ని హెచ్ఐవీ వణికించింది. ప్రజల్లో అవగాహనలేమితో ఎయిడ్స్ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పాకిపోయిన కేసుల పరంపర ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా ఉద్యమంలా జరిగిన పోరాటంతో సంక్రమణ రేటు అదుపులోకి వచ్చింది. డబుల్ డిజిట్ పాజిటివ్ రేటు నుంచి అర శాతానికి పడిపోయింది. నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవీ – ఎయిడ్స్ పరిస్థితులపై కథనం.
ఒకరి కన్నా ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడంతో హెచ్ఐవీ సోకుతుంది. రక్త మార్పిడి, తల్లిపాల ద్వారా బిడ్డకు, కలుషిత సిరంజీలతో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. మొదట ఈ వ్యాధిని ప్రాణాంతకమైనదిగా పరిగణించేవారు. కానీ శక్తివంతమైన ఏఆర్టీ మందులు, ఎయిడ్స్ వల్ల వచ్చే రుగ్మతలను నయం చేసే మందులు లభ్యమవుతుండడంతో ఊరట లభిస్తున్నది. మధుమేహం, రక్తపోటు లాంటి వ్యా ధుల మాదిరిగానే ఎయి డ్స్ కూడా దీర్ఘకాలికం గా నియంత్రించడానికి వీలు కలి గే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది హెచ్ఐవీ(హ్యూమన్ ఇమ్యునో డెఫిసియెన్సీ వైరస్)వల్ల వస్తుంది. ఎయిడ్స్ను ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిసియెన్సీ సిండ్రోమ్గా పరిగణిస్తుంటారు. హెచ్ఐవీ ఉన్న వారందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవీ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణిస్తుందో అప్పుడు వారికి ఎయిడ్స్ వచ్చినట్లుగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవీ ఉంటే అతనిని హెచ్ఐవీ పాజిటివ్ అని సంబోధిస్తారు.
సాధారణంగా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల వరకు పరీక్షల ద్వారా తెలుసుకోవడం సాధ్యం కాదు. జ్వరం, నోటిపూత, చర్మవ్యాధులు, నీరసం, నీళ్ల విరోచనలు, ఆకలి తగ్గిపోవడం, అలసట, పదిశాతం బరువు కోల్పోడం, గ్రంథుల వాపు హెచ్ఐవీ వ్యాధి ప్రాథమిక లక్షణాలు.
సాధారణంగా ఎయిడ్స్ వ్యాధి తల్లిగర్భం నుంచి బిడ్డలకు త్వరగా సోకుతుంది. ఇలాంటి ఘటనలో అప్పుడే పుట్టిన అభం శుభం తెలియని పిల్లలకు సురక్షితమైన జీవితాన్ని అందించేందుకు వైద్యాధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తల్లిదండ్రుల అవగాహన లేమితో జరిగిన నష్టాన్ని నివారించేందుకు అధునాతన వైద్య విధానాన్ని అవలంబిస్తున్నారు. హెచ్ఐవీ సోకిన తల్లికి నిరోధక శక్తిని పెంపొందించేలా, కడుపులోని బిడ్డకు వైరస్ అంతగా ప్రభావం చూపకుండా నివారిస్తున్నారు. ప్రసవ అనంతర కాలంలోనూ శిశువును రెండేండ్ల పాటు కంటికి రెప్పలా చూసుకుంటూ ఎయిడ్స్ మహమ్మారి నుంచి దూరం చేస్తున్నారు. ఇలా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎయిడ్స్ సోకిన తల్లి నుంచి శిశువుకు హెచ్ఐవీ ద్వారా నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది.
ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ అందిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ఒక్కటే. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులను వెచ్చిస్తున్నది. ఎయిడ్స్ బాధితులకు ప్రస్తుతం నెలకు రూ.2వేల చొప్పున పింఛన్ అందిస్తున్నారు. ఎయిడ్స్తో బాధపడుతున్న వారిని సమాజం దూరం పెడుతూ వస్తున్నది. హెచ్ఐవీ ఉన్నట్లుగా తెలిసిన వ్యక్తిని సామాజికంగా బహిష్కరించినట్లు ప్రవర్తిస్తున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. కన్నవారికి, కట్టుకున్నవారికి, ఇంటికి, గ్రామానికి దూరమైన వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు తీసుకుని ఆర్థిక సాయం అందిస్తున్నది.
సమయానికి పౌష్ఠికాహారం తీసుకోవాలి. తగినంత విశ్రాం తి, వ్యాయామం చేయాలి. ప్రశాంత జీవితం గడపాలి. వేళకు తప్పకుండా మందులు వేసుకోవాలి. అంటువ్యాధులు వ్యాపిం చిన ప్రదేశాలకు, అంటువ్యాధులు వ్యాపించిన రోగులకు దూ రంగా ఉండాలి. వైద్యులు సూచించిన టీకాలను తీసు కోవడం ద్వారా కొన్ని వ్యాధులను నివారించవచ్చు. సరైన సమయంలో క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ధూమపానం, మద్యపానం చేయకూడదు. సీడీ-4 కణాల సంఖ్యను ఎప్పటి కప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరంతరంగా క్షేత్రస్థాయిలో కౌన్సెలింగ్ చేయడం, కండోమ్ల వాడకం గురించి వివరించడం, కళాజాత కార్యక్రమాలు నిర్వహించడం, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో రెడ్రిబ్బన్ క్లబ్లు ఏర్పాటు, ఉన్నత పాఠశాలల్లో కౌమార విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో హోర్డింగ్స్ ద్వారా అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు.
నిజామాబాద్ – 3284
కామారెడ్డి – 3230