నస్రుల్లాబాద్, మార్చి 18: ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. బీర్కూర్ శివారులో శనివారం ఈదురుగాలులకు కూలిపోయిన అన్నపూర్ణ రైస్మిల్ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతోపాటు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధర, బోనస్ రూ.500 కూడా అందించాలన్నారు. రైతుబంధు పూర్తిస్థాయిలో ఇవ్వాలని, రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారని వెంటనే రుణమాఫీ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రారంభమై 100రోజులు దాటిపోయిందని ఇచ్చిన హామీలను గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల కోడ్ సాకుగా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని, వీలైనంత వరకు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని పథకాలను అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎంపీపీ రఘు, ఎంపీటీసీ సందీప్, కోఆప్షన్ సభ్యుడు ఆరిఫ్ తదితరులు ఉన్నారు.