మోర్తాడ్, జూలై 16: కమ్మర్పల్లి అటవీ రేంజ్ పరిధిలో జే1 పెద్దపులి కనిపించకుండా పోయిన ఘటనలో అటవీశాఖ అధికారులు అటవీప్రాంత గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే పెద్దపులి కోసం నిఘా ఉంచిన సమయంలో చిరుతపులులను చంపిన ఘటనలు బయటపడడం జిల్లాలో సంచలనం సృష్టించింది. చిరుత పులుల హతం కేసుల్లో అడవి దొంగలను పోలీసులు పట్టుకున్నారు.. కానీ మరి పెద్దపులి(జె1) ఎటుపోయిందనేది ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలింది. ఒకప్పుడు నక్సలైట్లు సంచరిస్తున్న సమయంలో అడవుల్లోకి మనషులు వెళ్లేందుకు భయపడే పరిస్థితులు ఉండేవి. అటవీ ప్రాంత గ్రామాలకు వెళ్లాలంటే జంకేవారు. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం ఒకవైపు అడవులకు రక్షణ లేకుండా పోగా, మరోవైపు అటవీప్రాణులకు కూడా రక్షణ కరువైందని రెండు చిరుతలను చంపిన ఘటనలతో తేటతెల్లమవుతున్నది.
కమ్మర్పల్లి అటవీరేంజ్ పరిధిలోని తాళ్లపల్లి, కారెపల్లి, భీంనగర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో సంచరించి కనిపించకుండా పోయిన పెద్దపులి జాడ కనిపించడంలేదు. పెద్దపులి కనిపించకుండాపోయిన నేపథ్యంలో ఇదే ప్రాంతంలో చిరుతపులిని చంపి తవ్విపాతిపెట్టిన విషయం బయటపడడం, వీరి ద్వారా మరో చిరుతను ధర్పల్లి అడవుల్లో చంపినట్లు తేలడం ఈ రెండు ఘటనలు జిల్లాలో సంచలనం సృష్టించాయి. చిరుత పులుల చర్మం, గోర్లు విక్రయించేందుకు ముఠాలుగా ఏర్పడి వన్యప్రాణులను చంపుతున్న అడవి దొంగలను పోలీస్, అటవీశాఖ అధికారులు పట్టుకున్నప్పటికీ పెద్దపులి జాడ తెలియకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్మం, గోర్ల కోసం చిరుతలనే చంపిన వారు పెద్దపులిని విడిచిపెడతారా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపులిని కూడా చంపారన్న ప్రచారం కొనసాగుతున్నది. దీనిపై పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
కమ్మర్పల్లి అటవీరేంజ్ పరిధితోపాటు ధర్పల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులులను చంపిన ఘటనలతో పాటు కనిపించకుండా పోయిన పెద్దపులుల ఆచూకీ అటవీశాఖ అధికారులకు సవాలుగా మారాయి. ఒకవైపు అటవీసంపద మాయవుతుండగా, మరోవైపు వన్యప్రాణులకు రక్షణ కరువైన పరిస్థితులు కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఏంచేస్తున్నారన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అటవీప్రాంతాలపై గట్టినిఘా ఏర్పాటు చేసి వన్యప్రాణులను, అటవీసంపదను సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.