ఏర్గట్ల/ వినాయక్నగర్, జూలై 26: నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొన్నది. ముప్కాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో పడి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో యువకుడు గల్లంతయ్యాడు. అతడి మృతదేహం కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న సీపీ సాయి చైతన్య ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. సరదాగా విహారయాత్ర కోసం వచ్చిన యువకులు బ్యాక్వాటర్(లక్ష్మీ కాలువ)లో పడి మృత్యువాత పడడంతో బాధిత కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్కు చెందిన కలీం(24), నజువత్(24), అజీమ్(24), మహారాష్ట్ర బోకర్లోని హిమాయత్నగర్కు చెందిన ఆర్హాన్(17) విహారయాత్ర కోసం ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ప్రాంతానికి వెళ్లారు. వరద కాలువ సమీపంలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి గల్లంతయ్యారు. అక్కడి ప్రత్యక్ష సాక్షి అందించిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి, కలీం, నజువత్, ఆర్హన్ మృతదేహాలను వెలికితీశారు.
అజీమ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై సమాచారం అందుకున్న నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు సీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వానాకాలంలో చెరువులు, నదులు, ప్రాజెక్టులు, బ్యాక్ వాటర్ల వద్ద సెల్ఫీలు దిగడం, ఈత కొట్టడం, సరదా కోసం నీటిలోకి దిగడం ప్రమాదమని, ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యమని, ప్రవాహం తెలియని ప్రాంతాలకు దూరంగా ఉండాలని సీపీ సూచించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ముప్కాల్ ఎస్సై సుహాసిని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సరదా కోసం వెళ్లి యువకులు, ఓ బాలుడు మృత్యువాత పడడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన వారిలో ఓ బాలుడి స్వగ్రాం మహారాష్ట్రలోని బోకర్ ప్రాంతంకాగా, మిగతా ముగ్గురిలో ఇద్దరు ఆటోనగర్, మరో యువకుడు అర్సపల్లికి చెందినవారు. మృతిచెందిన యువకులకు ఈత రాదని వారి వెంట వెళ్లిన ప్రత్యక్షసాక్షి అయిన వారి స్నేహితుడు తెలిపాడు. తాము ఇక్కడి నుంచి కలిసి వెళ్లినట్లు చెప్పాడు. తన స్నేహితుల్లో ఒకరు నీటిలోమునిగిపోతుండగా అతన్ని కాపాడేందుకు ఒకరి వెంట ఒకరు వెళ్లి మృత్యువాత పడినట్లు తెలిపాడు. ఒకేసారి ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడడం ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.