భీమ్గల్, ఫిబ్రవరి 8: ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించాలంటే నామోషీ అనుకునే తల్లిదండ్రులను ఈ పాఠశాల తన వైపునకు తిప్పుకున్నది. ఉన్నత విద్యలో సీట్లు సాధిస్తూ… ఉపకార వేతనాల పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకుంటూ.. చదువులోనూ ముందుంటూ ఆదర్శంగా నిలుస్తున్నది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరా జడ్పీహెచ్ఎస్ అందరి మన్ననలు పొందుతున్నది. మారుమూల గ్రామమైన మెండోరాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో వసతులు కల్పించడంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సాగుతున్నాయి. ఉమ్మడి పాలనలో ప్రవేశపరీక్షలు, స్కాలర్షిప్ టెస్టులు, క్రీడా పోటీలు తదితర వాటిల్లో కేవలం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ముందుండేవారు. స్వరాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందిస్తూ.. అన్నింటా ముందుండేలా కృషి చేస్తున్నది. ఉపాధ్యాయుల, పీఈటీల కొరత లేకుండా పాఠశాలల్లో వసతులు కల్పించడంతో సర్కారు పాఠశాలల విద్యార్థులు సైతం రాణిస్తున్నారు. పాఠశాలలో ఉచిత భోజనం, స్కూల్ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందించడంతో తల్లిదండ్రులకు ఆర్థికభారం నుంచి విముక్తి లభించినట్లయ్యింది. పాఠశాల సిబ్బంది ప్రత్యేక చొరవతో ట్రిపుల్ ఐటీ సీట్లతోపాటు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్టుల్లో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఉన్నత విద్యలో సైతం ఈ పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగువేస్తున్నారు. మెండోరా పాఠశాలకు చెందిన 34 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడంతోపాటు 49మంది ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ టెస్టులో ప్రతిభచూపి అందరి మన్ననలు పొందుతున్నారు. అదేవిధంగా రాష్ట్రస్థాయి సైన్స్, మ్యాథ్స్, సోషల్ టాలెంట్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన మేధా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పాఠశాలకు చెందిన సాహిత్య, పందిరి అరుణ్, వాల్గోట్ కిరణ్ ఏడు సంవత్సరాల ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు.
విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి చదువులో మెళకువలు నేర్పుతున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ముందుకు తీసుకొస్తున్నాం. క్రమశిక్షణతో మెలగడంతో సత్ఫలితాలు సాధిస్తున్నాం.
– గణేశ్, ఫిజికల్ సైన్స్, ఉపాధ్యాయుడు
మా పాఠశాలలో అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉండడంతో మంచి ఫలితాలను సాధిస్తున్నాం. ప్రతి సంవత్సరం మా పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధిస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను తయారు చేస్తున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహం, బడుల బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి.
– సుజాత, హెచ్ఎం, మెండోరా
నేను మెండోరా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందుకు గర్వపడుతున్నా. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి, చదువు పూర్తి చేసుకున్నా. ప్రస్తుతం హైదరాబాద్లోని టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా జాబ్ చేస్తున్నా. పాఠశాలలో నేర్పిన క్రమశిక్షణ ఎంతగానో ఉపయోగపడింది. కార్పొరేట్ సంస్థల్లో పని చేయాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి.. దానికి అనుగుణంగా మా పాఠశాలలో ఇంగ్లిష్ నేర్పించారు.
– మహ్మద్ సయ్యద్ నసీమ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ (2012-13 ఎస్సెస్సీ బ్యాచ్)
మా పాఠశాలకు చెందిన సీనియర్లు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడంతో నేను కూడా ఎలాగైనా సీటు సాధించాలనే పట్టుదలతో చదివాను. మా పాఠశాలల చదివిన విద్యార్థులు ఇప్పుడు మంచిమంచి కంపెనీల్లో పనిచేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మెండోరా విద్యార్థులకు మంచి గుర్తింపు ఉన్నది.
– తక్కూరి వర్షిణి, ట్రిపుల్ ఐటీ, బాసర