ధర్మపురి కుటుంబంలో రాజకీయ అలజడి రేగింది. అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. కాంగ్రెస్లో చేరిన కొన్ని గంటల్లోనే డి.శ్రీనివాస్ ‘రాజీ’నామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. డీఎస్, ఆయన భార్య విజయలక్ష్మి పేర్లతో సోమవారం రెండు లేఖలు విడుదలయ్యాయి. తాను కాంగ్రెస్లో చేరలేదని, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు డీఎస్ ప్రకటించారు. మీ రాజకీయాలకు డీఎస్ను వాడుకోవద్దని, ఆయనను ప్రశాంతంగా బతకనీయండని ఆయన భార్య విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గంటల వ్యవధిలోనే ఒక్కసారిగా పరిణామాలు మారిపోవడంతో డీఎస్ పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ తీవ్రంగా స్పందించారు. తన తండ్రికి ప్రాణహాని ఉందని, ఆయనతో బలవంతంగా లేఖలు రాయిస్తున్నారని అన్నారు. ఎక్కడా తన తమ్ముడు అర్వింద్ పేరెత్తని సంజయ్.. ఈ వ్యవహారం వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడని స్పష్టం చేశారు. నీచ రాజకీయాల కోసం దిగజారి, తల్లిదండ్రులతో ఆటలాడుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలతో వాడు గేమ్స్ ఆడుతున్నాడని, బీజేపీ డర్టీ పాలిటిక్స్కు ఇదే నిదర్శనమన్నారు. మరోవైపు, ధర్మపురి కుటుంబంలో వివాదం రేగడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని డీఎస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– నిజామాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన గంటల్లోనే డి.శ్రీనివాస్ రాజకీయ సన్యాసం ప్రకటించడం, తమ జోలికి రావొద్దంటూ ఏకంగా ఆయన భార్య పేరిట లేఖ, వీడియో బయటికి రావడం నిజామాబాద్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెర వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నట్లుగా డీఎస్ సన్నిహితులు చర్చించుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ అర్వింద్ ఇదంతా నడిపిస్తున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. తన అన్న సంజయ్పై ఉన్న కోపంతో పాటు తండ్రిని రాజకీయంగా వాడుకుంటే తన భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో రాత్రికి రాత్రే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా ప్రకటన ఇప్పించాడని అంటున్నారు. ఈ పరిణామాలతో ధర్మపురి సంజయ్, ధర్మపురి అర్వింద్ మధ్య నెలకొన్న పొలిటికల్ వార్ ఒక్కసారిగా బహిర్గతమైంది. ఆధిపత్యం, రాజకీయ భవిష్యత్తు కోసం ఏకంగా కన్న వారిని ముందుకేసి నాటకీయ పరిణామాలను సృష్టిస్తుండడంపై జిల్లా ప్రజల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.
లేఖల సారాంశమిదీ..
ధర్మపురి శ్రీనివాస్, ధర్మపురి విజయలక్ష్మి పేరిట రెండు వేర్వేరు లేఖలు ఒకే సమయాన మీడియాకు విడుదల అయ్యాయి. మొదటి లేఖలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ డీఎస్ పేర్కొన్నాడు. తానిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ఆరోగ్యం సహకరించనందున రాజకీయ నిష్క్రమణ చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. ఇదే అంశంపై తమను వదిలేయాలని… తమతో ఆటాలాడుకోవద్దంటూ డీఎస్ భార్య విజయలక్ష్మి మరో లెటర్ విడుదల చేశారు. మొదటి లెటర్లో ఈ నెల 26వ తేదీన నా కుమారుడు డి.సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా, ఆశీస్సులు అందజేయడానికి గాంధీభవన్కు వెళ్లిన నాకు కండువా కప్పి, నేను కూడా మళ్లీ పార్టీలో చేరినట్లుగా మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ, ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదల్చుకున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్కు ముడిపెట్టడం భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందన్న విషయం మనకు తెలియనిది కాదు. ఆరోగ్యరీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నన్ను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని మీరు భావిస్తే ఈ లేఖను నా రాజీనామాగా భావించి ఆమోదించాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ ఉంది.
డీఎస్కు బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం…
డి.శ్రీనివాస్ భార్య విజయలక్ష్మి పేరిట రిలీజ్ అయిన మరో లేఖలో డీఎస్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లుగా స్పష్టమైంది. వీడియో, లేఖ రూపంలో ధర్మపురి విజయలక్ష్మి విడుదల చేసిన సందేశంలో కాంగ్రెస్ పార్టీ తీరును ఆమె తప్పు బట్టారు. వాస్తవానికి ధర్మపురి అర్వింద్ కుటుంబం ఈ స్థాయిలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అన్న సంగతి అందరికీ తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో కీలకమైన పదవులను నిర్వహించిన డీఎస్ తిరిగి అదే పార్టీని తిడుతూ లేఖలు సంధించడం వెనుక బీజేపీ పార్టీలో కొనసాగుతున్న ఎంపీ అర్వింద్ హస్తం తప్పక ఉందంటూ కాంగ్రెస్ వాదులు వాదిస్తున్నారు. తన స్వార్థ్య రాజకీయం కోసం అర్వింద్ చేస్తోన్న డ్రామా అంటూ ఆరోపిస్తున్నారు. ఆ లేఖలో ఇలా ఉంది. “ఇగో డీఎస్ గారి రాజీనామా. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి, మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకి చేతులు జోడించి దండం పెడుతున్న… ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి…” ఇట్లు ధర్మపురి విజయలక్ష్మి అంటూ డీఎస్ భార్య పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ దిగజారుడుకు నిదర్శనం ఇదీ…
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక రోజులోనే జరిగిన ఈ డెవలప్మెంట్ గమనిస్తుంటే మా డాడీకి ప్రాణహాని ఉందని అనిపిస్తుంది. ఒక కొడుకు ఇలా చేస్తారని ఎవరూ ఊహించరు. కన్నతండ్రితో ఆటలాడుకుంటున్నారంటే ఎవరూ క్షమించరు. మా మదర్ మా తమ్ముడు ఎట్లా చెబితే అట్లా మాట్లాడుతారు. ఆమె గురించి ఏం మాట్లాడను. ఆమె పొలిటీషియన్ కాదు. పాలిటిక్స్ తెల్వదు ఏమీ తెల్వదు. ఆమెకు ఎటువంటి సంబందం లేదు. ఇక్కడ మీరు చూడాల్సింది బీజేపీ ఎంపీ ఏ లెవెల్కీ దిగజారి కన్నతండ్రిని, కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా ఎట్లా వాడుకుంటున్నాడు అన్నది గమనించండి. వాళ్లను అన్యాయం చేస్తున్నడు. ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నడు అనేది సమాజానికి తెలిసిపోయింది. ఇదీ వాడి పొలిటికిల్ కెరీర్ పతనానికి అంతం. ఈ రోజు మధ్యాహ్నం డాడీతో మాట్లాడాను. అంత మంచిదే అన్నడు.
ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ కావడం లేదు. వాడు(ధర్మపురి అర్వింద్) ఢిల్లీలో ఉండి నాటకాలు ఆడుతున్నాడు. ఇక్కడ కొంత మంది చుట్టుపక్కల వర్కర్లను పెట్టుకుని ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకుని గేమ్స్ ఆడుతున్నడు. ఇప్పుడు ప్రజలకు వాడు ఏం మొఖం చూపిస్తాడు. ఏమని సమాధానం చెబుతాడు. మా నాన్నకు ఫోన్ చేస్తున్న లేపడం లేదు. ఆయన పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు. వాడికి(అర్వింద్కు) ఎవరెవరు సహకరిస్తున్నారో వాళ్లకు మంచిది కాదు. ఇదీ ఎవరికీ మంచిది కాదు. పబ్లిక్ తిరగబడిన రోజున మీకు పుట్టగతులుండవు. చాలా మంది డాడీ ఫ్రెండ్స్కు, నాకు తెలిసిన వాళ్లకు బెదిరింపులు వస్తున్నాయి. డాడీ అక్కడ(బీజేపీ ఎంపీ అర్వింద్ వద్ద) సేఫ్గా లేడు. కొద్ది రోజుల్లోనే నిజామాబాద్కే తీసుకువద్దామని అనుకున్నా. ఈ మనిషి ఇంతగా దిగజారిండు. ఇలా చేస్తాడని అనుకోలేదు.
– ధర్మపురి సంజయ్, నిజామాబాద్ మాజీ మేయర్, డీఎస్ పెద్ద కొడుకు
విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ సంజయ్
ఖలీల్వాడీ, మార్చి 27 : రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే తన తండ్రి డీఎస్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి పార్టీలో చేరుతానని చెప్పారని మాజీ మేయర్ సంజయ్ తెలిపారు. తన తండ్రి కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగారని చనిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా తనపై ఉండాలనే ఆయన కోరిక అన్నారు. ప్రస్తుతం ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆనందంగా ఉండేందుకే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. తన తల్లి డీఎస్ పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ రాసిన విషయంపై ఆయన సోమవారం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రితో పాటు తాను ఆదివారం కాంగ్రెస్ పార్టీ లో చేరానని.. తన తండ్రి కాంగ్రెస్లో చేరడం ఇష్టం లేని మా ఇంట్లోని ఓ వ్యక్తి డర్టీ పాలిటిక్స్ చేస్తున్నాడని ఇది బీజేపీ చేస్తున్న డ్రామా అని దుయ్యబట్టారు. గత ఏడాది క్రితమే తన తం డ్రి, తాను కాంగ్రెస్లో చేరే కార్యక్రమం కొన్ని కారణాలతో వాయిదా పడిందన్నారు.
తన తం డ్రిని, తనను కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కల్పించిన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుచరులు, ప్రజల నుంచి వచ్చి విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆదివారం, సోమవారం తన తండ్రి పేరు మీద వచ్చిన లేఖలు పూర్తిగా కల్పితమని ఇవన్నీ తమ ఇంట్లో ఉన్న ఓ బీజేపీ నాయకుడు చేస్తున్న డ్రామాలన్నారు. తన తల్లి మాట్లాడిన మాటలు తాను వినలేదని, ఆమె ఎప్పుడూ రాజకీయాల్లో లేదని తన తండ్రి సుధీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న ఆమె ఎప్పు డు పాల్గొనలేదన్నారు. దాని గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మీడియా ప్రతినిధులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ కల్పిత లెటర్లను నమ్మవద్దన్నారు. బలవంతంగా తన తండ్రిచేత లెటర్లు రాయిస్తూ సంతకాలు చేయిస్తున్నారన్నారు. తన తండ్రిని ఇంట్లోని వారు ఇబ్బందులు పెడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.