వినాయక్నగర్, జనవరి 29 : నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముబారక్నగర్లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండిండ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ముబారక్నగర్ ప్రాంతంలోని కస్తూరి గార్డెన్ కాలనీలో ఉండే ధనలక్ష్మి తల్లి ఇటీవల మరణించారు. ఆమె ఇంటికి తాళం వేసి కంఠేశ్వర్ ప్రాంతంలో నివాసముంటున్నది. దీంతో ఆమె ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు.
బీరువాలో ఉన్న 5 తులాల బంగారు నగలను చోరీ చేశారు. అనంతరం ముబారక్నగర్ ఏరియాలోని రాజగంగు అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. 5 తులాల బంగారు నగలతో పాటు రూ.1.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. రెండు చోరీలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని కాలనీవాసులు కోరుతున్నారు.