రాజకీయ లబ్ధి కోసం పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టిన బీజేపీ నీచ రాజకీయాలపై పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న కుట్రతో మరీ ఇంతకు దిగజారుతారా..? పదో తరగతి పేపర్లను లీక్ చేసి పిల్లల బతుకులతో ఆడుకుంటారా? అని నిలదీస్తున్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను మానసికంగా క్షోభ పెడుతున్నారు.. మీ కూతురో, కొడుకో పదో తరగతి పరీక్షలు రాస్తుండగా ఇలా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుండేదని వాపోతున్నారు. పసి హృదయాలు తల్లడిల్లి పోతున్నాయని, సరిగ్గా చదవలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరుపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుట్రదారులను కటకటాల్లోకి పంపడంతో పాటు యథావిధిగా పరీక్షలు నిర్వహిస్తుండడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు, లీకేజీ కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయి. విద్యార్థుల మనోైస్థెర్యం దెబ్బతినకుండా సత్వరమే స్పందించడంపై హర్షం వ్యకం చేస్త్తున్నాయి. రాజకీయ కుట్రల్లో ఉపాధ్యాయులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 6
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా బండి సంజయ్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతూ ఇంత నీచానికి దిగజారడమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఇంతగా బరితెగించాలా అని విమర్శిస్తున్నారు. పేపర్ లీకేజీతో పిల్లలతోపాటు తామూ గందరగోళంలో పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. అసలు పరీక్షలు జరుగుతాయా? లేదా? అనే సందేహం కలుగుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. లీకేజీ అంశం బయటికి రాగానే వేగవంతంగా విచారణ చేపట్టి కుట్రదారులను అరెస్టు చేసి జైల్లో పెట్టడంపై సంతోషం వెలిబుచ్చారు. ఎనిమిదేండ్లలో ఎప్పుడూ కాని లీకేజీ ఇప్పుడే బయటికి రావడంపై బీజేపీ కుట్ర కనిపిస్తోందని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపోళ్లకు పుట్టగతులుండవని శాపనార్థాలు పెడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతోపాటు పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను నమస్తే తెలంగాణ పలుకరించగా వారి అభిప్రాయం వెల్లడించారు.
ఉన్నత పదవుల్లో ఉండి విద్యార్థులను ఇబ్బందులు పెట్టేవారు మీరు రాజకీయ నాయకులా..? రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇలా చేస్తారా? ఇంత ఘోరంగా ఉంటారా మనుషులు. తల్లిదండ్రులైన మమ్మల్ని, మా పిల్లల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టలేక చిల్లర రాజకీయాలు చేయడమా? పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు గెలిపిస్తే ఆ ప్రజల పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి.
– నరాల సుధాకర్,విద్యార్థిని తండ్రి, నిజామాబాద్
పదోతరగతి పరీక్షల పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. పేపర్ లీక్తో విద్యార్థులు ఎంతో ఒత్తిడికి లోనవుతారు. వ్యక్తిగత రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడం చాలా దారుణమైన విషయం. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటివి పునరావృతం అయితే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేస్తుంది. కరోనా తర్వాత విద్యార్థులు ఇప్పుడిప్పుడే చదువుపై దృష్టి పెడుతున్నారు. ఈ పేపర్ లీక్తో విద్యార్థుల్లో మరింత గందరగోళం నెలకొంటుంది. తర్వాతి పరీక్షలు జరుగుతాయో జరగవో అనే సందిగ్ధంలో మిగతా పరీక్షల కోసం చదవకుండా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా విద్యార్థులకు భరోసా ఇచ్చి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉంది.
– ఎ.రాంమోహన్,విద్యార్థిని తండ్రి, కామారెడ్డి
కమ్మర్పల్లి, ఏప్రిల్ 6: ఎస్సెస్సీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం చక్కగా నిర్వహిస్తున్నది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగాభివృద్ధికి పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో నాణ్యమైన విద్యనందిస్తూ భావిపౌరులకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా, పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థి నిలబడేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా పోటీ పరీక్షలు, బోర్డు పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తుంది. సొంత రాష్ట్రంలో ఇన్నేండ్లు నిర్వహించిన పోటీ పరీక్షలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. పారదర్శకంగా పరీక్షల నిర్వహణ జరుగుతున్న రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న లీకేజీ ఘటనలు కుట్రపూరితంగా జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. పరాయి పాలనలో విద్యారంగంలోనూ వివక్ష ఎదుర్కొని కొలువుల్లో వెనుకబాటు అనుభవించిన తెలంగాణ విద్యార్థి లోకానికి ఈ పరిణామాలు అన్యాయం చేస్తాయి. ఇలాంటి తరుణంలో సైతం టెన్త్ పరీక్షల నిర్వహణను భేషుగ్గా నిర్వహిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.
-కొమ్ముల రాజేందర్, పదో తరగతి విద్యార్థి తండ్రి, కమ్మర్పల్లి
పరీక్ష పేపర్ లీక్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులుగా మాలో గందరగోళం నెలకొన్నది. ఎంతో కష్టపడి మా పిల్లలను చదివిస్తే పేపర్ లీక్ కావడంతో విద్యార్థుల భవిష్యత్తు అయోమయానికి గురికావాల్సి వచ్చింది. దీంతో పిల్లలు కూడా ఎంతో ఒత్తిడికి లోనై మిగతా పరీక్షలపై దృష్టిపెట్టకుండా పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కుట్ర జరిగింది. దీంతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. దీనికి బాధ్యులైన వారిపై ప్రత్యేక దృష్టి సారించి కఠినంగా శిక్షించాలి.
-బి.రాజేశ్వర్ గౌడ్, విద్యార్థి తండ్రి, కామారెడ్డి
కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే పదోతరగతి పేపర్ లీక్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధికోసం పరీక్ష పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. ఇన్నేండ్లుగా జరగని పేపర్ లీక్ ఇప్పుడు తమ రాజకీయ మనుగడ ఎక్కడా ఆగిపోతుందోనని విద్యార్థులను పావుగా వాడుకున్నారు. ఈ విధంగా పేపర్ లీక్ చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలనే కుట్ర పన్నారు. కారకులను పట్టుకొని జైల్లో పెట్టి కఠినంగా శిక్షిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడొచ్చు. ఇది కేవలం బీజేపీ పన్నిన కుట్ర. తమ రాజకీయ మనుగడను కాపాడుకోవడానికి ఇది ఒక పెద్ద కుట్రలా కన్పిస్తుంది.
-సి.నరేశ్, విద్యార్థిని తండ్రి, కామారెడ్డి
కామారెడ్డి, ఏప్రిల్ 6: పదోతరగతి పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు ఆందోళనచెందారు. కానీ విద్యార్థులు పేపర్ లీక్పై దృష్టి సారించకుండా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టి శ్రద్ధగా చదువుకోవాలి. పేపర్ లీక్తో విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. పరీక్షలు జరుగుతాయో జరగవో అనే ఆందోళన చెందుతున్నారు. జరగబోయే పరీక్షలపై దృష్టి సారించకుండా, పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. తక్కువ మార్కులతో పాసైతే పైచదువులకు నష్టం కలుగుతుంది. పదోతరగతి తర్వాత చాలా మంది విద్యార్థులు డాక్టర్, ఇంజినీర్ కావాలనే ఉద్దేశంతో మంచి మార్కులు తెచ్చుకోవాలనే పట్టుదలతో చదువుతారు. ఈ పేపర్ లీక్తో కష్టపడి చదివే విద్యార్థులు ఎంతో నష్టపోతారు. గతంలో ఎప్పుడూ ప్రశ్నపత్రం లీక్ కాలేదు. కానీ ఇప్పుడు పరీక్ష పేపర్ లీక్ కావడంతో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రత్యేక బృందం తో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
– అంబీర్ మనోహర్రావు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు,
నిజాంసాగర్, ఏప్రిల్ 6: కొంతమంది రాజకీయ స్వార్థం కోసం పదో తరగతి విద్యార్థులతో చెలగాటం ఆడుతున్నారు. రాజకీయ ఆటలకు విద్యార్థులను బలిచేయొద్దు. పదో తరగతి పరీక్ష పేపర్లను లీక్ చేయడంతో లాభం ఏవరికి. విద్యార్థులను ఆందోళనకు గురిచేయడం మాత్రమే. మొన్న ఓ ఆకతాయి చేసిన బుద్ధిలేని పనికి ఉపాధ్యాయులు బలయ్యారు. నిన్న జరిగిన పనికి కూడా ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం తగదు. లీకేజీ ఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉందో వారిని బాధ్యులను చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. రాజకీయాల కోసం ఉపాధ్యాయులను బలిచేయడం తగదు. పరీక్షలను కట్టుదిట్టుమైన చర్యలతో నిర్వహిస్తున్నాం. కావాలనే కొంతమంది రాజకీయాల కోసం ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నరు. ఇలాంటి ఘటనతో ఉపాధ్యాయులు పరీక్షల విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారు. ఇన్విజిలేటర్లకు ముందునుంచే సెల్ఫోన్ల అనుమతి లేదు. ఎవరో కావాలనే ఇలాంటి సంఘటనలకు పాల్పడడం.. ఉపాధ్యాయులను బాధ్యులుగా చేయడం తగదు. టీసీఏ రూల్స్ ప్రకారం బాధ్యులైన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలి. కానీ సర్వీసు నుంచి తొలగించడం సరికాదు.
-అల్లాపూర్ కుషాల్,
పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి
ఖలీల్వాడి, ఏప్రిల్ 6: పేపర్ లీకేజీ వ్యవహారాన్ని రాజకీయం చేయడం దారుణం. అభం శుభం తెలియని పదో తరగతి విద్యార్థుల మనోభావాలతో ఆడుకోవడం వారి ఆత్మైస్థెర్యాన్ని ద్బెతీయడమే. ఇంత దిగజారి రాజకీయం చేయడం ఇదే మొదటిసారి. రాజకీయ దాహం కోసం అటు విద్యార్థులను ఇటు ఉపాధ్యాయులను బద్నాం చేయడం ఇదేమి రాజకీయమో అర్థం కావడం లేదు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఈ పేపర్ లీకేజీను వాడుకోవడం ఇంతకన్నా ఘోరం మరొక్కటి ఉండదు. మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఇలాంటి దారుణాలు చేయడం ఏంటి? ఈ వ్యవహారంలో ఉపాధ్యాయులు బలికావడం, ఉపాధ్యాయ లోకాన్ని బద్నామ్ చేయడం జరికాదు. మీ కూతురు, కోడుకు పదో తరగతి పరీక్షలు రాస్తుండగా ఇలా జరిగితే ఆ బాధ మీకు తెలుస్తుంది. ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెబితేనే మీరు ఉన్నత స్థానంలో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి ఇలా చేస్తున్నారు. ముఖ్యంగా హిందీ పేపర్ లీకేజీలో భాగంగా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్లను తొలగించడంతో సమస్త ఉపాధ్యాయులు డ్యూటీ అంటేనే భయపడుతున్నారు. ఇటు ఉపాధ్యాయులను, అటు విద్యార్థులను ఇబ్బంది పెట్టి మీరు సాధించేది ఏమిటీ? వరంగల్ జిల్లా కమలాపూర్లో ఇన్విజిలేటర్ తప్పు లేకున్నా పనిలో నిమగ్నమైన సమయంలో రాజకీయ లబ్ధి కోసం బయటి నుంచి ఎవరో వచ్చి పేపర్ ఫొటో తీసుకోవడంతో ఆ ఇన్విజిలేటర్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం బాధాకరం. పరీక్షల్లో జరిగే ప్రతి చిన్న తప్పుని ఉపాధ్యాయుల మీదికి నెట్టివేయకుండా క్షుణంగా పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏ పనీ చేయకుండా అటంకాలు సృష్టిస్తున్నారు. లీకేజీల పేరుతో పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. మీకు పిల్లలు ఉంటే తెలుస్తుంది ఆ బాధ…
– పొద్దుటూరి మోహన్రెడ్డి,
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 6 : ప్రశ్నాపత్రం లీకేజీ అనే పదమే ఇప్పుడు సరైనది కాదు. పేపర్లోని ప్రశ్నలు పరీక్షా కేంద్రానికి వెళ్లకముందే విద్యార్థులకు తెలిసి, వారు వాటికి సమాధానాలు తెలుసుకొని కేంద్రానికి వెళ్తే.. పేపర్ లీకేజీ అనొచ్చు. కానీ ఇప్పుడు అలాంటి సంఘటనలు జరుగలేదు. విద్యార్థులంతా పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరో ఒక్కరు చేసిన తప్పు కారణంగా ఆ పేపరు బయటికి వస్తే దానితో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి చెడు పనులతో విద్యార్థుల్లో పూర్తిగా గందరగోళం నెలకొంటున్నది. పరీక్షను బాగా రాసి బయటికి వచ్చిన తర్వాత పేపరు లీక్ అయిందని తెలుసుకొని విద్యార్థులు తీవ్రస్థాయిలో అయోమయానికి గురవతున్నారు. అదే పరీక్ష మళ్లీ రాయాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. తర్వాత రాయాల్సిన పరీక్షకు సరిగా ప్రిపేర్ కావడం లేదు. ఎక్కడో జరిగిన విషయాన్ని వెంటనే సోషల్ మీడియాలో పెట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. నిమిషాల వ్యవధిలో లక్షల మందికి తెలియడంతో ప్రయోజనం కన్నా కష్టం, నష్టం ఎక్కువే. వ్యక్తులు చేసే తప్పిదాన్ని వ్యవస్థకు ఆపాదించడం సరికాదు. బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే అప్పుడు వ్యవస్థను తప్పుపట్టొచ్చు. ఒకరిద్దరి స్వార్థంతో లక్షలాది మంది విద్యార్థులను గందరగోళానికి గురిచేయడం సరికాదు. లోపాన్ని ఎత్తి చూపడం మంచిదే.. కానీ అదే లోపాలమయం అనడం సరికాదు. ఏ ప్రభుత్వం అయినా విద్యార్థుల బాగుకోసం పని చేస్తుంది. ఆ పనుల్లో లోపాలు జరగడం పనిచేసే సిబ్బందిదే తప్ప ప్రభుత్వానిది కాదు. ప్రశ్నపత్రం బయటికి రావడం అనే విషయంలో ప్రభుత్వానికి చెడును ఆపాదించడం ప్రతిపక్షాలు చేసే పని. ఇది పద్ధతి కాదు. దీనిని విజ్ఞులు ఎవరూ స్వాగతించడం లేదు. ఇది విద్యావ్యవస్థకు తీవ్రనష్టం కలిగిస్తుంది. పేపరు బయటికి రావడం అనే విషయంలో విద్యాశాఖ కన్నా పోలీసు వ్యవస్థను ఎక్కువగా ప్రశ్నించాల్సి ఉంటుంది. పోలీసుల భద్రత సరిగా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా! ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ విద్యార్థులకు నష్టం కలుగొద్దని ఆలోచిస్తూ ఇలాంటి వాటి ప్రచారం అడ్డుకోవాలి. ఎక్కడ జరిగిన తప్పుకు అక్కడి వారు మూల్యం చెల్లించక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది. జరిగిన పరీక్షలపై ఆలోచన చేయకుండా జరగాల్సిన వాటిపై విద్యార్థులు మనసు పెట్టేలా చూడాలి. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జరగాల్సిన పరీక్షలపైనే దృష్టి సారించి బాగా రాసేలా చూడాలి. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు అధికారులు మరింతగా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులుగా మేము పూర్తిస్థాయిలో సహకరిస్తాం. మరోసారి తప్పు జరుగకుండా విద్యాశాఖ తీసుకునే చర్యలకు ఉపాధ్యాయ సంఘం తరఫున పూర్తి మద్దతు ఉంటుంది.
-దామోదర్ రెడ్డి, పీఆర్టీయూ కామారెడ్డి అధ్యక్షుడు