Collector Ila Tripathi | ఎడపల్లి, జూన్ 9 : జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట్ గ్రామంలోని సహకార సంఘం (సొసైటీ) గోదాంలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు.
రైతులు తప్పనిసరిగా యూరియా యాప్ను వినియోగించాలని, యాప్ ద్వారా రైతులకు ఎకరానికి రెండు యూరియా బస్తాల చొప్పున కేటాయింపు ఉంటుందని తెలిపారు. యూరియాను విడతల వారీగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ప్రస్తుతం ఏయే పంటలను సాగు చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గోదాములోని యూరియా నిల్వలను పరిశీలించి స్టాక్ వివరాలపై ఆరా తీశారు. ఈ తనిఖీలో తహసీల్దార్ దత్తాద్రి, ఎంపీడీవో శంకర్ నాయక్, వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు