అక్టోబర్ 5: దేశంలో వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదని, కరెంటు కోసం రైతులు, ప్రజలు నిత్యం రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేసిన ఘటనలను గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే విద్యుత్ కోతలు లేవని కొనియాడారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో విద్యుత్ కొరత ఉన్నదని, పవర్ హాలీడే ప్రకటించినట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, కోటగిరి మండలాల్లో స్పీకర్ పోచారం గురువారం పర్యటించారు.
బాన్సువాడ మండలం కొల్లూర్లో రూ.100కోట్లతో ఏర్పాటు చేసిన 223/132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవునిపల్లి ప్రభాకర్రావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు, ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో రూ.14కోట్లతో నిర్మించిన వెంకటాద్రి అతిథి గృహాన్ని ప్రారంభించారు. తాడ్కోల్ గ్రామంలో రూ.48లక్షలతో నిర్మించిన రెడ్డి సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోటగిరి మండల కేంద్రంలో రూ.20కోట్లతో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించారు. ఆయా చోట్ల బతుకమ్మ చీరెలు, గృహలక్ష్మి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వేర్వేరు చోట్ల నిర్వహించిన సభల్లో స్పీకర్ పోచారం మాట్లాడారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టితో వ్యవహరించి రూ.96,500 కోట్లు ఖర్చు చేసి విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి దేశంలోనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చిదిద్దారన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదన్నారు. రాష్ట్ర విభజన కింద తెలంగాణకు 7780 మెగావాట్ల విద్యుత్ వచ్చిందని, సీఎం కేసీఆర్ ముందుచూపు, సీఎండీ ప్రభాకర్రావు చొరవతో నేడు 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నామని చెప్పారు. వేసవికాలంలో నిమిషం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. విద్యుత్ కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడంతో తాను బాన్సువాడ నుంచి హైదరాబాద్కు చేరుకోవాలంటే దాదాపు 10 గంటలు పట్టేదని గుర్తుచేశారు.
చాలీచాలని విద్యుత్ సరఫరాతో పంటలు ఎండి రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడేవారని ఆవేదన వ్యక్తంచేశారు. నేడు ధర్నాలు, రాస్తారోకోలు ఎక్కడా లేవన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు భవిష్యత్లో విద్యుత్ కోతల బారినపడకుండా ఉండేందుకు 220/132/33 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుకు కృషి చేశానన్నారు. ఈ సబ్ స్టేషన్తో బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలతోపాటు కొద్దిమేర ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు 60ఏండ్ల పాటు విద్యుత్ సమస్య లేకుండా ఉంటుందని స్పీకర్ తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చానని తెలిపారు. భవిష్యత్లో నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటికి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు.
– స్పీకర్తో మాటామంతిలో మున్నూరుకాపులు
బాన్సువాడ, అక్టోబర్ 5: ‘ఈసారి భారీ మెజారిటీతో గెలిచి హోంమంత్రి అవుతారు సార్’ అంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వద్ద నియోజకవర్గానికి చెందిన మున్నూరుకాపులు మనోగతాన్ని వెల్లడించారు. గురువారం మున్నూరు కాపు సంఘ భవనానికి భూమిపూజ చేసేందుకు వచ్చిన స్పీకర్ పోచారం కాసేపు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా హోంమంత్రి అవుతారు సారని చెప్పగా.. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశానని, ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నానని, ఇంతకు మించి పదవులు నాకొద్దని స్పీకర్ పోచారం అన్నారు. తాను చాలాసార్లు మంత్రి పదవులు చేశాని, కానీ స్పీకర్ పదవి అత్యున్నత స్థానం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఉంటారు, కానీ స్పీకర్ ఒక్కరే ఉంటారని చెప్పారు.