ఏర్గట్ల, జూలై 26 : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్కు చెందిన షేక్ ఖలీం (24), నజువత్ (24), అజీమ్ (24), మహారాష్ట్ర బోకర్లోని హిమాయత్నగర్కు చెందిన ఆర్హాన్ (17) విహారయాత్ర కోసం ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ప్రాంతానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా.. షేక్ ఖలీం, నజువత్, ఆర్హాన్ మృతదేహాలు లభించాయి. మరో యువకుడు అజీమ్ ఆచూకీ కోసం గాలించారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేసినట్టు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కొల్లాపూర్, జూలై 26 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడేనికి చెందిన కాట్రాజ్ బాలయ్య (45) శనివారం మధ్యాహ్నం కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. కాట్రాజ్ బాలరాజు, నర్సమ్మ దంపతులు చేపల వేటకు వెళ్లారు. పుట్టిలో కృష్ణానదిలోని కొత్తిగుండు వరకు చేరుకున్న తర్వాత వలను వదులుతున్న సమయంలో బాలయ్య ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అగ్ని మాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో వెతికినా ఆచూకీ లభించలేదు.