శక్కర్నగర్, ఫిబ్రవరి 24 : మద్యం సేవించి వేధింపులకు గురి చేస్తున్న భర్తను.. భార్య హత్య చేసిన ఘటన బోధన్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి బోధన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన బక్కోల్ల బాలయ్యకు కుమారుడు బాలు (32), కుమార్తె ఉన్నారు. కుమారుడికి పదేండ్ల క్రితం వివాహం జరిగింది. అతడు భార్య గౌతమి, ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నాడు. కాగా.. బాలు నిత్యం మద్యం సేవించి భార్యను వేధించేవాడు. పిల్లలను విక్రయిస్తానంటూ బెదిరించేవాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్య గౌతమితో గొడవ పడిన బాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. మద్యం సేవించి వచ్చి ఇంట్లో పడుకున్నాడు. తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని విసిగిపోయిన గౌతమి.. బాలు తలపై రాయితో మోదింది. దీంతో అతడు తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. గౌతమి ఆదరాబాదరాగా ఇంటి నుంచి వెళ్లిపోవడాన్ని గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు. అప్పటికే బాలు మృతి చెందాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ పట్టణ సీఐ ప్రేమ్కుమార్, ఎస్సైలు నరేశ్, దరివేముల పీటర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరారీలో ఉన్న గౌతమిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని పట్టణ సీఐ బీడీ ప్రేమ్ కుమార్ తెలిపారు.