గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులు.. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన జనాలు.. ఎండాకాలం వచ్చిందంటే ‘పానీ’పాట్లతో అల్లాడి పోయిన ప్రజలు.. సమైక్య పాలనలో తాగునీటి కోసం సతమతమైన పరిస్థితి పోయింది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక ‘మిషన్ భగీరథ’తో తెలంగాణ గొంతు తడిసింది. ఇంటింటికీ జల సిరి నడిచొచ్చింది. ఆడవాళ్ల యుద్ధాలు, కిలోమీటర్ల మేర నెత్తిమీద బిందె పెట్టుకొని నడిచే పరిస్థితి పోయింది. ప్రతి పల్లె, ప్రతి తండా, గ్రామం, పట్టణం.. అన్నింటికీ తాగునీరు అందించేందుకు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పైపులైన్లు వేశారు. స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. మారుమూలన ఉన్న గూడేలకు కూడా పైపులైన్లు వేసి తాగునీరు అందించే లక్ష్యంగా మొదలైన మిషన్ భగీరథ పథకం నూటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మంచినీళ్ల పండుగ నిర్వహించనున్నారు.
సమైక్య పాలనలో ప్రజలు తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు లేకున్నా పట్టించుకున్న వారు మచ్చుకూ కనిపించలేదు. ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల పొడవున రోడ్లెక్కినా ఆదుకున్న వారూ కనిపించలేదు. మంచి నీళ్లు మహాప్రభో అని చేతులు జోడించి.. కనిపించిన రాజకీయ నాయకులను వేడుకున్నా ఉమ్మడి రాష్ట్రంలో కనికరించనే లేదు. వేసవి కాలం వచ్చిందంటే చాలు రోడ్లపై నిత్యం ఖాళీ బిందెలతో ధర్నాలు, రాస్తారోకోలతో ప్రజలు నిరసన వ్యక్తంచేసేవారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను అడ్డగించి తాగునీటి గోసపై నిలదీసేవారు. ఇప్పుడిలాంటి దుస్థితి మచ్చుకైనా కనిపించకపోవడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే మిషన్ భగీరథ పథకానికి బీజం వేసి అతి స్వల్ప వ్యవధిలోనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని పూర్తిచేసి ఇంటింటికి తాగునీరు అందిస్తున్నారు. తద్వారా దశాబ్దాల సమస్యలకు చెక్పడడంతో భగీరథ నీళ్లు ఇంటింటికీ పరుగులు తీస్తూ ప్రజల గొంతు తడుపుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 1,681 ఆవాసాలకు మిషన్ భగీరథ అందుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వానకాలంలోనూ తాగునీటి కటకట కనిపించేది. ఇప్పుడైతే మండుటెండల్లోనూ నీటి కొరత లేకుండా మంచి నీటి సరఫరా విజయవంతంగా జరుగుతుండడం విశేషం.
ఇబ్బందులు పడేటోళ్లం..
పిట్లం, జూన్ 17 : ఎండకాలం అచ్చిందంటే మా ఊళ్లో బోర్లన్ని ఎండిపోతుండె. తాగడానికి కూడా నీళ్లు దొరకక చానా ఇబ్బంది పడేటోళ్లం. సీఎం కేసీఆర్ సారు మిషన్ భగీరథ పథకం షూరు జేసినప్పటి సంది ఎండకాలంల కూడా ఇంటి ముందట పెట్టిన నల్లాకు నీళ్లు వస్తున్నయ్. అప్పట్ల పడ్డ బాధలు ఇప్పుడు లేవు. నీళ్లు కూడా మంచిగుంటున్నయ్. మాకు మంచినీటి సౌలత్ జేసిన కేసీఆర్ సారును యాది మరువం.
– మేథరి మల్లవ్వ, కంభాపూర్, పిట్లం
ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే?
గడపగడపకూ అందిస్తున్న మిషన్ భగీరథ నీళ్లను తరలించడం.. అదో భారీ ప్రక్రియ. జలాశయం వద్ద ఫిల్టర్ చేసిన నీళ్లను పైప్లైన్ ద్వారా తరలించడం ఊహకు అందని ఇంజినీరింగ్ మహిమతో కూడుకున్నది. ఉభయ జిల్లాలకు మిషన్ భగీరథ నీటికి సింగూర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులే కీలకం. సింగూర్ ప్రాజెక్టు నీటి ద్వారా బోధన్ నియోజకవర్గంలో 4 మండలాలు, జుక్కల్ నియోజకవర్గంలో 6 మండలాలు, బాన్సువాడ నియోజకవర్గంలోని 8 మండలాలతోపాటు ఎల్లారెడ్డిలోని 3 మండలాలు మొత్తం 21 మండలాల్లో 819 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతున్నది. సింగూర్ సెగ్మెంట్ పరిధిలో 21 మండలాల్లోని 819 ఆవాసాలకు నీళ్లు అందుతున్నాయి. 518.44 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలతోపాటు ఎల్లారెడ్డిలోని సగం మండలాలకు మొత్తం 554 గ్రామాలకు తాగునీటి పథకం మేలు చేకూరుతున్నది. శ్రీరాంసాగర్ సెగ్మెంట్లో 1,547 కిలో మీటర్ల మేర పైపులైన్ బిగింపు జరిగింది. 862 ఆవాసాలకు బల్క్వాటర్ సైప్లె విజయవంతంగా ప్రతిరోజూ సాగుతున్నది.
కాలంతో సంబంధం లేకుండా..
మిషన్ భగీరథ పథకానికి కాలంతో సంబంధం లేదు. ఏ కాలమైనా తాగునీరు ఇంటి గడపను ముద్దాడాల్సిందే. ఇదే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేశారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే తాగునీటికి వనరుల కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకున్నది. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునరుజ్జీవ పథకం ద్వారా అనుసంధానించడంతో నీటి కొరతకు చెక్ పెట్టారు. సింగూర్కు కాళేశ్వరం జలాలు తరలించే ప్రక్రియ మొదలవ్వడంతో మిషన్ భగీరథ ద్వారా ఈ సెగ్మెంట్ పరిధిలో తాగు నీటికి ఇబ్బంది లేకుండా పోనున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో నీటి గోస తీరు వర్ణణాతీతంగా ఉండేది. ఇప్పుడా తాగు నీటి తిప్పలు కనిపించడం లేదు. స్వచ్ఛమైన నీరు నేరుగా ఇంటి గడప ముందుకే మిషన్ భగీరథ రూపంలో వస్తుండడంతో ఆడబిడ్డలకు భారీ ఊరట దక్కుతున్నది. మిషన్ భగీరథ పథకం ద్వారా వానకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట పడినట్లు అయ్యింది. డయేరియా, హెపటైటిస్ వంటి వ్యాధులు జాడ లేకుండా పోవడంతో భగీరథ నీటి గొప్పతనం పల్లెల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.
ఎత్తైన ప్రాంతాలకూ సరఫరా
ఉమ్మడి జిల్లాలోని తండాలన్నీ అటవీ, ఎత్తైన కొండ ప్రాంతాల్లోనే నెలవైనవి. ఈ ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన తాగు నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పని చేసింది. ఖర్చుకు వెనుకడుగు వేయకుండా గిరిజన ప్రాంతాల్లోని జనాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే సంకల్పంతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారు. ఏ ఒక్క ప్రాంతాన్నీ వదిలి పెట్టకుండా నీటిని ఇంటింటికీ అందించిన ఘనత ఈ పథకానికే దక్కింది. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకొని మిషన్ భగీరథ పైపులైన్ల అమరిక సాగింది. భారీ ఎత్తున యంత్రాలను ఉపయోగించి పైపులను భూ అంతర్భాగం గుండా వేశారు. గ్రావిటీ ఆధారంగా నీళ్లను పంపే చోట్ల ఎత్తుపల్లాలను సముద్రమట్టంతో బేరీజు వేసుకుంటూ ముందుకు సాగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 15వందలకు పైగా తండాలకు శుద్ధజలం చేరుతుండడం విశేషం.
పిట్లం మండలంలోని కారేగాం తండాలో మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా అవుతున్న నీటిని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. నీటిని వృథా చేయకుండా తండాలోని ప్రతి ఇంటికీ వెళ్లి అధికారులు అవగాహన కల్పించారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో ఇంటి ముంగిట్లోనే నల్లాలను ఏర్పాటు చేసి తాగునీరు అందించడంతో సంతోషంగా వాడుకుంటున్నామని తండావాసులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
నీటి కష్టాలు తీరాయి..
పిట్లం, జూన్ 17 : సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంతో మాకు నీటి కష్టాలు తీరాయి. మా ఊళ్లో ఎండాకాలం వస్తే నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. ఇప్పుడు స్వచ్ఛమైన తాగునీరు ప్రతి రోజూ పొద్దున్నే ఇంటి ముందట నల్లాకు పట్టుకుంటున్నాం. నీటి ఇబ్బందులు తీర్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– బోయిని బాలమణి, కంభాపూర్, పిట్లం
బాయిలకాడికి పోయే బాధ తప్పింది
పిట్లం, జూన్ 17 : ప్రతి ఏడాది ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల కోసం బాయిలకాడికి పోయేటోళ్లం. బాయికాడ లైన్ల నిలబడి నీటిని చేదుకొని ఇంటికి వచ్చేటోళ్లం. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను ప్రారంభించి మా తండాల్లో కూడా ఇంటింటికీ నల్లాలు పెట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో నీటి బాధ తప్పింది. ప్రతి రోజూ ఉదయం లేవగానే స్వచ్ఛమైన నీటిని మా ఇంటి వాకిట్లోనే పట్టుకొని వాడుకుంటున్నాం.
– బూలిబాయి, జగదాంబ తండా, పిట్లం