నవీపేట,డిసెంబర్ 8: బతుకు దెరువు కోసం ఇతర దేశానికి వెళ్లిన ఓ బాధితుడు ఏజెంట్ మోసంతో జైలు జీవితం అనుభవించి చివరికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల చొరవతో స్వగ్రామానికి చేరాడు. మండలంలోని యంచ గ్రామానికి చెందిన నూనె రాజు ఎనిమిది నెలల క్రితం బతకు దెరువు కోసం మలేషియా వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. చెన్నై నగరానికి చెందిన ప్రకాశ్ అనే ఏజెంట్కు రూ. 1.10 లక్షలు చెల్లించాడు. కంపెనీ వీసా ఇప్పిస్తానని నమ్మ బలికి విజిట్ వీసా ఇప్పించాడు. మలేషియా వెళ్లిన బాధితుడు అక్కడి కంపెనీ విజిట్ వీసా అని తేల్చడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. స్వదేశానికి రావడానికి డబ్బులు సైతం లేకపోవడంతో మూడు నెలల అనంతరం అక్కడి ప్రభుత్వం రాజును నెల రోజుల పాటు జైల్లో పెట్టింది. అక్కడ కొంతమందితో ఏర్పడిన ఏర్పడిన పరిచయంతో ఫోన్ ద్వారా యంచ గ్రామ మాజీ ఉప సర్పంచ్ లాలు యాదవ్, ఎంపీటీసీ లలితా సంజీవ్కు సమాచారం అందించాడు. వారు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. కవిత ఎన్నికల బిజీలో ఉన్నప్పటికీ సొంత ఖర్చుతో అక్కడి పోలీసులకు జరిమానా చెల్లించి స్వదేశానికి రావడానికి ప్రయాణ ఖర్చులు సైతం పంపారు. దీంతో రాజు గురువారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్నాడు.
గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన తనను స్వగ్రామానికి చేర్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితకు నూనె రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఏజెంట్ ప్రకాశ్ మాయలో పడి కంపెనీ వీసా పేరిట మోసపోయానన్నారు. ఈ సందర్భంగా యంచ గ్రామ మాజీ ఉప సర్పంచ్ లాలు యాదవ్, ఎంపీటీసీ లలితా సంజీవ్, భూమయ్య, దీపక్, అతీఖ్కు కృతజ్ఞతలు తెలిపాడు.