Bajireddy Jagan | సిరికొండ, జూన్16 : యూరియా యాప్ తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో యూరియా యాప్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆయన మంగళవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘యూరియా యాప్ పోవాలి.. రేవంత్ దిగిరావాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రైతులపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే యూరియా యాప్ తెచ్చి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సకాలంలో రైతుబంధు ఇవ్వక రైతులను ప్రభుత్వం నట్టేట ముంచుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతును రాజును చేసే ఘనత కేసీఆర్ కే దక్కిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో రైతులకు ఎరువులు సకాలంలో పథకాలు అందించడంతోపాటు రైతు సంక్షేమం కోరిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, ఆకుల తిరుమల, లక్ష్మీ, నరసయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.