బోధన్, డిసెంబర్ 7: నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండలం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 9 గంటలకు మండల ప్రారంభోత్సం జరగనున్నది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోధన్ ఎమ్మెల్యే షకీల్ రానున్నారు. కొత్త మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన తహసీల్ కార్యాలయాన్ని వారు ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగసభలో మాట్లాడుతారు.
సాలూరా మండలం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేయనున్న బహిరంగసభ కోసం బోధన్ ఎమ్మెల్యే షకీల్ బుధవారం సాయంత్రం స్థలాన్ని పరిశీలించారు. సాలూరా గ్రామంలోనూ, శివారులోని వివిధ స్థలాలను పరిశీలించిన అనంతరం ఆయన నాందెడ్కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన బహిరంగసభ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ స్థలాన్ని చదును చేయాలని, బహిరంగసభ కోసం పెద్ద వేదికను ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాలూరా మండలం ప్రారంభోత్సవానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత వస్తున్నారని, వేలాది మందితో బహిరంగ సభను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఈ సభ విజయవంతం కోసం సాలూరా మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు.
ఎమ్మెల్యే వెంట రైతుబంధు సమితి మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు గోగినేని నరేంద్రబాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాలూరా షకీల్, డీసీసీబీ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, గింజుపల్లి శరత్, సాలూరా సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, మండల నాయకుడు వినోద్ నాయక్, అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామ నాయకులు ఇల్తెపు పెద్ద గంగారాం, కేజీ గంగారాం, వెంకట్పటేల్ తదితరులు ఉన్నారు.