మోస్రా (చందూర్ ), జూలై 3: బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గుంటకూ సాగు నీరందిస్తామని, ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మోస్రా మండలంలోని గోవూర్, చింతకుంట గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోవూర్లో కాకతీయ కళాతోరణాన్ని ప్రారంభించారు. కళాతోరణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి రూ. లక్ష విరాళం అందజేశారు. అనంతరం స్పీకర్ చింతకుంట గ్రామానికి చేరుకున్నారు. 40వ డిస్ట్రిట్యూటరీ కెనాల్ ఆయకట్టుపై ఆధారపడి సాగవుతున్న 500 ఎకరాలకు నీటిని అందించేందుకు రూ. 5 కోట్లతో చేపట్టనున్న రివర్స్ పంపింగ్ సిస్టం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పల్లె దవాఖానతోపాటు పలు కుల సంఘాల భవనాలను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గుంటకూ సాగునీరు అందించే దిశగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. దేశంలో రైతన్న తలెత్తుకునేలా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. నిజాంసాగర్ ఆయకట్టుపై లక్ష ఎకరాలు ఆధారపడ్డాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు కొండపోచమ్మ నుంచి నిజాంసాగర్లోకి తరలించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రూ.150 కోట్లతో నిర్మిస్తున్న చందూర్, జాకోరా, చింతకుంట లిఫ్ట్ పనులు చురు గ్గా సాగుతున్నాయని తెలిపారు. వీటి ద్వారా 10 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. రూ. 200 కోట్లతో సిద్ధాపూర్ లిఫ్ట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, దీని ద్వారా మరో 12 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.
మన రాష్ట్రంలోనే రైతు సంక్షేమ పథకాలు
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ తెలంగాణలో తప్ప, ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలోనే అమలుచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గంలోనే 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే రూ. రెండు వేల పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. రెండు రోజుల క్రితం ఖమ్మంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ రూ. నాలుగు వేల పింఛన్ ఇస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పారని అన్నారు. ఒకవేళ రూ. 4వేల పింఛన్ ఇవ్వాల్సి ఉంటే.. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇవ్వకుండా ఇక్కడ మాటలు చెబితే ఎలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ గుత్ప విజయ భాస్కర్ రెడ్డి, ఎంపీపీలు పిట్ల ఉమా శ్రీరాములు, లావణ్యా రాంరెడ్డి, డీఎంహెచ్వో సుదర్శనం, తహసీల్దార్ సాయిలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి, ఎంపీటీసీ మమత, వైస్ఎంపీపీ కత్తి శంకర్, సర్పంచులు నరేందర్ రెడ్డి, విమలా లింగయ్య, సున్నం భూమయ్య ,సాయరెడ్డి, బొడ్డోల్ల సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, గుడిపల్లి గంగారెడ్డి, అశోక్, సాయాగౌడ్, పీరోజీ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.