బాల్కొండ, మార్చి 12: ఎక్కాలు (టేబుల్స్) చెప్పుడం లేదని ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో ఓ విద్యార్థి కన్నుకు తీవ్రగాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఎద్దండి శ్రీరామ్ తొమ్మిదో తరగతి (ఎ-సెక్షన్) చదువుతున్నాడు. సోమవారం తరగతి గదిలో గణితం ఉపాధ్యాయుడు శ్రీరామ్ను ఎక్కాలు అడిగాడు. విద్యార్థి చెబుతుండగా ‘ఇంకా ఎన్ని రోజులు నేర్చుకుంటావు’ అంటూ చేతిలో ఉన్న కర్రతో కొట్టాడు. దీంతో శ్రీరామ్ ఎడమ కన్నుకు తీవ్ర గాయమైంది.
కంట్లో నుంచి రక్తం రావడంతో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థిని ఆర్మూర్లోని ఓ కంటి దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. విద్యార్థి కన్ను సరిగా కనిపించడం లేదని, కంటి చూపుపోతే ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థి తండ్రి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని స్థానికులు తెలిపారు.