సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఎస్సారెస్పీ వరద గేట్లకు సరికొత్త టెక్నాలజీతో మరమ్మతు పనులు చేపట్టారు. ప్రాజెక్టు వరద గేట్లను ఇప్పటి వరకు మ్యానువల్గా ఎత్తేవారు. ప్రస్తుతం వీటికి అత్యాధునిక ఆన్,ఆఫ్ మిషన్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు, కాలువల గేట్ల నియంత్రణ పూర్తిగా ప్రాజెక్టు హెడ్ కంట్రోల్ రూమ్ నుంచే కొనసాగించవచ్చు. సీసీ కెమెరాల ద్వారా ఎగువ ప్రాంతాల నుంచి ఎంత ఇన్ఫ్లో చేరుకుంటుందనేది అంచనావేసి దిగువకు ఆన్,ఆఫ్ బటన్ సిస్టమ్తోనే కావాల్సిన వరదగేట్లను ఎత్తి నీటిని విడుదల చేయవచ్చు.
మెండోరా, జూన్ 25: రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టును సరికొత్త టెక్నాలజీతో ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. గేట్ల మరమ్మతులకు కొత్త పరికరాలను అమర్చుతూ వరదగేట్లకు సంబంధించిన కౌంటర్ వెయిట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరదగేట్ల మరమ్మతు పనులను సరికొత్త టెక్నాలజీతో చేపడుతున్నారు. ఎస్సారెస్పీ 42 వరదగేట్లతోపాటు కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువల వరదగేట్లను హైడ్రాలజీ సిస్టమ్ ద్వారా సరికొత్త టెక్నాలజీతో లిఫ్టింగ్ పనులు చకచకా నిర్వహిస్తున్నారు. వరదగేట్ల కోసం అడ్వాన్స్ లిఫ్టింగ్ పరికరాలను ఇప్పటికే బిగించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మ్యానువల్ ఉన్నాయి. గతంలో ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చినప్పుడు 42 గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేసేవారు. అయితే ప్రస్తుతం హైడ్రాలజీ యంత్రాలను 42వరద గేట్లతోపాటు కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువల వరదగేట్లకు బిగించారు. ఎస్సారెస్పీతోపాటు నిర్మల్ జిల్లాలోని కడెం, కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ ప్రాజెక్టులకు ఈ టెక్నాలజీ ద్వారా గేట్లు తెరిచేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ మూడు ప్రాజెక్టులకు ఇప్పటికే మ్యానువల్ వరదగేట్లు ఉండగా వాటికి ప్రస్తుతం నూతన టెక్నాలజీతో ఆన్అండ్ ఆఫ్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సామగ్రి మూడు నెలల క్రితం ప్రాజెక్టుకు చేరుకోగా ప్రస్తుతం బిగింపు పనులను పూర్తి చేసుకున్నది. మరో పది రోజుల్లో హైడ్రాలజీ లిఫ్టింగ్ పనులు పూర్తి కానున్నాయి. అదేవిధంగా ఒక్కో వరద గేటుకు ఒక్కో సీసీ కెమెరా చొప్పున 42 వరదగేట్లకు బిగించారు. కాకతీయ కెనాల్కు 4, సరస్వతీ, లక్ష్మీ కాలువలకు రెండు చొప్పు న, వరదకాలువకు 6 సీసీ కెమెరాలను బిగించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి 2 పీటీ జెట్ (360 డిగ్రీల) సీసీ కెమెరాలను ప్రాజెక్టుపై ఏర్పాటు చేశారు. దీంతో ప్రాజెక్టు, కాలువల గేట్ల నియంత్రణ పూర్తిగా ప్రాజెక్టు హెడ్ కంట్రోల్ రూమ్లోనే కొనసాగించవచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి ఎంత ఇన్ఫ్లో చేరుకుంటుందనేది అంచనావేసి ఆన్ ఆఫ్ బటన్ సిస్టమ్తోనే కావాల్సిన వరదగేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశమున్నది. దశాబ్దాల నుంచి మ్యానువల్గా ఉన్న పరికరాలు ఆన్ ఆఫ్ సిస్టమ్కు మారుతుండడంతో పలు సాంకేతిక సమస్యలు దూరమవుతాయని ఎస్సారెస్పీ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద నూతనంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాం. 42 వరదగేట్లకు సంబంధించిన యంత్రాలను సాఫ్ట్వేర్ సహాయంతో అమర్చి సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. దానికి సంబంధించిన పూర్తి సామగ్రి, బిగింపు పనులు పూర్తయ్యాయి. రానున్న వరదలను దృష్టిలో ఉంచుకొని మరో పది రోజుల్లో పనులు పూర్తిచేస్తాం.
– చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ