దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా, అడవిలో మగ్గిపోయిన గిరిజనుల బతుకుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెలుగులు నింపింది. ఎక్కడో విసిరి పడేసినట్లుండే తండాలకు అభివృద్ధి ఫలాలను చేర్చింది. విద్యుత్, రోడ్లు, ఇంటింటికీ మంచినీళ్లు.. ఇలా అన్ని మౌలిక వసతులను సమకూర్చిన కేసీఆర్ సర్కారు.. తండాలను పంచాయతీలుగా మార్చి పాలనాపగ్గాలు వారికే అప్పగించింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 245 తండాలకు మహర్దశ కలిగినట్లయింది. సమైక్య పాలనలో గోస పడిన అడవి బిడ్డల అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేశారు. జీవన పోరాటంలో ‘తండా’్లడుతున్న బంజారాలకు వినూత్న సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల పెంపుతో భరోసాగా నిలిచారు. ఒకప్పుడు చిమ్మచీకట్లలో మగ్గిపోయిన తండాలు నేడు ఉజ్వలంగా వెలిగి పోతున్నాయి. గిరిజన గూడెల్లో ప్రగతి కాంతులు వెల్లివిరుస్తున్నాయి. అంతేకాదు.. దశాబ్దాలుగా పోడును నమ్ముకుని జీవిస్తున్న గిరిపుత్రులకు సీఎం కేసీఆర్ త్వరలోనే ‘పట్టా’భిషేకం చేయనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ నేడు గిరిజనోత్సవం నిర్వహించనున్నారు.
నిజామాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తండాలంటే ఊరికి చివరన, ఎక్కడో కొండలు, గుట్టల్లో పడేసినట్లు ఉండే చిన్నపాటి ఆవాస కేంద్రాలు. ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తుల సమూహంతో ఏర్పడిన శ్రమైక జీవనం తండాల సొంతం. వ్యవసాయం, అడవి తల్లిని నమ్ముకొని జీవించే తండాలవైపు స్వతంత్ర భారతావనిలో పాలకులు ఏనాడూ కన్నెత్తి చూడలేదు. సమాజం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తండాల అభివృద్ధి ఓ మూలకు పడి ఉంది. గ్రామాలను ఆనుకొని ఉన్న తండాలు అభివృద్ధి చెందినప్పటికీ ఊరికి చివరన ఉన్న గిరిజన పల్లెలో పరిపాలన అన్నదే కనిపించని పరిస్థితి. తండాల్లో క్రమంగా జనాభా పెరుగుదల, అవసరాలు విస్తరిస్తున్నా వారిని పట్టించుకునే వారు గగనమయ్యారు. అలాంటి గూడేలకు స్థానిక పాలనను చేరువ చేయాలని రెండు దశాబ్దాల క్రితమే తలచిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం స్వరాష్ట్రంలో గిరిజనుల ఎన్నోఏండ్ల కలను సాకారం చేశారు. తండాలు నేడు గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెంది నాలుగేండ్లుగా స్వపరిపాలనా వెలుగుల్లో పయనిస్తున్నాయి.
గ్రామాలే దేశానికి వెన్నెముక అన్న మహాత్మా గాంధీ మాటలు రాష్ట్రంలో స్పష్టంగా అమలవుతున్నాయి. పల్లెలకు ప్రాణం పోసే విధంగా సుపరిపాలన.. కాంతులను వెదజల్లుతున్నది. ఇన్ని రోజులపాటు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను స్వతంత్ర హోదాతో పంచాయతీలుగా ఏర్పాటుచేయడంతో వాటి ఉనికి బాహ్య ప్రపంచానికి తెలిసింది. తండాలన్నీ పంచాయతీలుగా మారి ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కడంతో గిరిజనులు సంతోషిస్తున్నారు. పంచాయతీ ముఖం చూడాలంటే కిలోమీటర్ల మేర ప్రయాణించే పరిస్థితి నుంచి గ్రామ పంచాయతీలే నేడు అడవి బిడ్డలకు చేరువకావడం విశేషం.
గిరిజన తండాలు, శివారు పల్లెలకు పంచాయతీ కళ వచ్చింది. ఇతర పంచాయతీల కింద అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తండాలు ఇప్పుడు ఏకంగా కొత్త పంచాయతీలుగా మనుగడ సాధించి అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. సీఎం కేసీఆర్ కృషితో ఉనికిలోకి వచ్చిన గిరిజన గ్రామాల్లో ప్రజలకు ఎంతో మేలు జరిగింది. పంచాయతీల ఏర్పాటుతోపాటు ప్రతి జీపీకీ కార్యదర్శులను నియమించి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకున్నది.
తెలంగాణ కోసమే ఆలోచించే కేసీఆర్ 2001 నుంచి ఉద్యమ పథంలోకి దూకి కార్యక్షేత్రంలో అనేక చేదు అనుభవాలను చూశారు. తెలంగాణ ప్రజల దుస్థితిని కండ్లారా చూసిన ఉద్యమ నాయకుడు.. స్వపరిపాలనలో అందరి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా కొత్త జిల్లాలు, మండలాలు, జీపీలతో పాలనను ప్రజల చెంతకు తెచ్చారు. 2016 అక్టోబర్ 11న ఆవిర్భవించిన కామారెడ్డి జిల్లాలో 323 గ్రామ పంచాయతీలుంటే, వాటి సంఖ్య 526కు చేరింది. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా దాటిన ప్రతి తండానూ పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీంతో 116 తండాలకు మహర్దశ కలిగింది. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలుండగా, ఇందులో కొత్తగా 129 గిరిజన గ్రామాలు పంచాయతీలుగా మారాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 245 తండాలకు గ్రామ పంచాయతీ హోదా దక్కింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ గిరిజన గ్రామాలన్నీ గతం కన్నా మెరుగైన ఫలితాలను రాబడుతూ అభివృద్ధిని సాధిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన మాట ప్రకారం 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. అన్ని అర్హతలున్న పల్లెలను సైతం 2018లోనే పంచాయతీలుగా గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చారు. కొత్త పంచాయతీలను బలోపేతం చేసేందుకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫైనాన్స్ కమిషన్ నిధులను మంజూరు చేస్తున్నది. తద్వారా పల్లెల అభివృద్ధికి ప్రాణం వచ్చింది. దేశంలోనే తెలంగాణ పల్లెలు నేడు ఆదర్శంగా నిలబడ్డాయి. పల్లెప్రగతి ద్వారా ప్రకృతి వనాలు, ట్యాంకర్లు, ట్రాక్టర్లు, వైకుంఠధామాలతోపాటు వీధి దీపాలు, ఇంటింటికీ నల్లాలు తదితర సకల సౌకర్యాలతో గిరిజన తండాలకు కొత్తకళ వచ్చింది.