రాజంపేట్, మే 14 : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు క్రీడాపోటీల్లో పాల్గొనవచ్చు. సోమవారం (నేటి) నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని మండల కేంద్రాల్లో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ విభాగాల్లో మొదట మండల స్థాయిలో పోటీలను 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నారు.
జిల్లా స్థాయిలో పోటీలను ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు పోటీలు నిర్వహించనున్నారు. మండల స్థాయిలో విజయవంతంగా నిర్వహించడానికి మండల స్థాయి అధ్యక్షులు, చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సై మెంటర్లుగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, చైర్మన్, అదనపు కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి, వైస్ చైర్మన్ తదితరులు నిర్వహణసభ్యులుగా వ్యవహరిస్తారు.