కోటగిరి, డిసెంబరు 16 : వర్ని మండలకేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాల భవన నిర్మాణానికి రూ. 10.7 కోట్ల నిధులు మంజూరు కావడంతో వర్ని, చందూరు, మోస్రా, రుద్రూరు, కోటగిరి మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వర్నిలోని కమ్యూనిటీ వైద్యశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి దవాఖానలో వైద్యసేవలను మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దవాఖానలో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేయించి, వైద్య సిబ్బందిని భర్తీ చేయించడంతోపాటు ముప్పై పడకల దవాఖానగా అభివృద్ధి చేయించారు. డీఎంహెచ్వో ఆధీనంలో కొనసాగుతున్న ఈ దవాఖానను ఆరు నెలల క్రితం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి తీసుకెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.10.7 కోట్లను సీఎం కేసీఆర్ సహకారంతో స్పీకర్ మంజూరు చేయించారు. ఈ నిధులతో శిథిలావస్థలో ఉన్న దవాఖాన స్థలంలో నూతన భవనాన్ని నిర్మించడంతోపాటు వసతులు కల్పించనున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు.
దవాఖాన ఆవరణలో భవన నిర్మాణం చేపట్టేందు స్థలాన్ని పరిశీలించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం వర్నికి రానున్నారు. దవాఖాన అభివృద్ధికి నిధులు కేటాయించడంపై స్థానిక ప్రజలతోపాటు నాయకులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వర్ని పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషి చేస్తున్నారు. గతంలో కూడా దవాఖాన అభివృద్ధి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. దవాఖానలోనే గర్భిణులకు ఆపరేషన్ చేసేలా ఏర్పాట్లు చేయించారు. దీంతో గర్భిణులు బోధన్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే సమస్యలు పరిష్కారమయ్యాయి.
కల్లాలి గిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
వర్ని దవాఖానకు మంజూరైన నిధులతో వర్ని మండలంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందనున్నది. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, వైద్యారోగ శాఖ మంత్రి హరీశ్రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు.
-వెలగపూడి గోపాల్,
వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్