బాన్సువాడ, అక్టోబర్ 16 : ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు అభివృద్ధి, సంక్షేమ రంగాలు రెండు కండ్ల లాంటివని.. సమాజంలో 85 శాతం ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అవసరమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. సోమవారం ఆయన బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల మ్యా నిఫెస్టోను వంద శాతం అమలు చేశారన్నారు. ప్రస్తుత పథకాలను అమలు చేస్తూనే నూతన ప్రభుత్వంలో కొత్త పథకాలను ప్రారంభిస్తామన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి అధికారంలోకి వస్తామని.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలన లో పాలకులు ఏనాడూ తెలంగాణ ప్రాంత వాసుల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కానీ సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అమ లు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చెప్పింది చేస్తారని.. చేసిందే చెబుతారన్నారు. ఆయన ప్రకటించే పథకాలు పేదల గుండెల్లో నుంచి వచ్చినవే అన్నారు. కరో నా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదన్నారు. సీఎం కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అన్ని సాధ్యపడుతాయని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో పథకాలు లేవు
ఇటీవల కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల వేళ ఓట్ల కోసం అమలుకు సాధ్యం కాని హామీలు ప్రకటిస్తున్నారని తెలిపారు. అసలు బీజేపీ, కాంగ్రెస్లు జాతీయ పార్టీ లా.. ప్రాంతీయ పార్టీలా చెప్పాలన్నారు. జాతీయ స్థాయి లో ఒక పాలసీ, రాష్ట్ర స్థాయిలో ఒక పాలసీ ఉంటుందా అని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మోసం చేసేందుకు ఇష్ట మొచ్చినట్లు హామీలు గుప్పిస్తున్నారన్నారు. కానీ ఆయా పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మొన్న కర్ణాటకలో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రస్తుతం చేతులెత్తేసిందన్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తున్నారని దుయ్యబట్టారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హామీలను నెరవేర్చి, తెలంగాణలో ప్రకటించాలన్నారు.
అధికారంలోకి వస్తామని కలలు కనడం మానుకోవాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో తయారు చేసి ప్రకటించాన్నారు. కేసీఆర్పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ప్రజల ఆశీర్వాదంతో మరోమారు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ తరఫున బీ-ఫామ్ అందించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్ , బీజేపీ పార్టీలకు అభ్యర్థులు లేరన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీధర్, నర్సింహాచారి, శ్రీనివాస్, ముదిరెడ్డి విఠల్ రెడ్డి, వినయ్ కుమార్, బాలకృష్ణ ఉన్నారు.