కామారెడ్డి/ ఖలీల్వాడి, ఫిబ్రవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామగ్రామాన శిబిరాలు ఏర్పాటు చేయగా ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. వైద్య సిబ్బంది నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను అందజేస్తున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో కంటి వెలుగు శిబిరాలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ నేత్ర పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు. కామారెడ్డి లింగంపేట మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్ తనిఖీ చేశారు. కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ తదితర వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.
నేత్ర పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ వివరాలు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 44 వైద్య బృందాలతో కంటివెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. మంగళవారం 5,810 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 827 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామని డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు 93,837 మందికి పరీక్షలు నిర్వహించి, 16,395 మంది కళ్లద్దాలు అందజేసినట్లు ఆయన వివరించారు. నిజామబాద్ జిల్లాలో మంగళవారం 8,934 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1,107మందికి కళ్లద్దాలు అందజేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 1,50,533 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 50,002 మందికి కళ్లద్దాలను అందించినట్లు పేర్కొన్నారు.