ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకం.. మన ఊరు- మనబడి/ మన బస్తీ- మనబడి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, హాజరుతోపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసమే మన ఊరు- మనబడి పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా మొదటి విడుతలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నది. నీటి సౌకర్యంతోపాటు టాయిలెట్లు, విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నిచర్, మరమ్మతులు, కిచెన్లు, తరగతి గదుల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నది. దీంతో ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ధర్పల్లి, డిసెంబర్ 5: ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ‘మన ఊరు – మన బడి’ కింద ఎంపిక చేశారు. నిధులు మంజూరు కావడంతో పాఠశాలలో పూర్తిస్థాయి విద్యుద్దీకరణ, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. నూతనంగా తాగునీటి ట్యాంకును ఏర్పాటు చేసి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినట్లుగా స్కూల్ ప్రహరీకి నల్లాలు బిగించారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో చేతులను కడుక్కోవడానికి సౌకర్యవంతంగా మారింది. త్వరలోనే మరమ్మతు పనులు పూర్తిచేసి రంగులు వేయించనున్నారు. మన ఊరు – మన బడి ద్వారా మండలంలో మొదటి విడుతలో మొత్తం 14 పాఠశాలలను ఎంపిక చేయగా సీతాయిపేట్ ప్రాథమిక పాఠశాలను మాడల్గా ఎంపిక చేశారు.
ఏర్గట్ల, డిసెంబర్ 5: మన ఊరు – మనబడి కార్యక్రమం కింద ఏర్గట్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రూ.8.80లక్షలు, ఉర్దూ మీడియం పాఠశాలకు రూ.5లక్షలు, తడ్పాకల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రూ.6.80లక్షలు, గుమ్మిర్యాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రూ.7.22లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రతి తరగతి గదిలో ట్యూబ్ లైట్లు,నాలుగు ఫ్యాన్లు బిగించారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణం, భవనాల మరమ్మతులు, టైల్స్, తాగునీటి సౌకర్యం, సంపు నిర్మాణ పనులు చేపట్టారు. గుమ్మిర్యాల్ పాఠశాలలో నీటి నిల్వ కోసం తవ్విన సంపు పని ఒక్కటి మినహా అన్నిపనులు పూర్తయ్యాయి.
శక్కర్నగర్ , డిసెంబర్ 5: ‘ మన బస్తీ- మన బడి’ కార్యక్రమంతో బోధన్ పట్టణం తీర్గల్లీ ప్రాథమిక పాఠశాలకు రక్షణ ఏర్పడింది. ఏండ్లకాలంగా పరిష్కారానికి నోచుకోని పలు సమస్యలకు పరిష్కారం లభించింది. తీర్గల్లీ పాఠశాల ఆవరణ విశాలంగా ఉన్నప్పటికీ ప్రహరీ, కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాఠశాలను స్థానికులు వారి అవసరాలకోసం వినియోగించేవారు. దీనికి తోడు పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు వెనుకడుగు వేశారు. ‘మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన నిధులతో చేపట్టిన పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రహరీ నిర్మాణం పూర్తిచేసి పాఠశాలకు రక్షణ చర్యలు చేపట్టారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించారు. మధ్యాహ్న భోజనం అనంతరం హ్యాండ్వాష్ కోసం ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టారు.
నిజాంసాగర్, డిసెంబర్ 5: నిజాంసాగర్ మండలంలో మనఊరు – మనబడి కార్యక్రమానికి మొదటి విడుతలో 13 పాఠశాలలను ఎంపిక చేశారు. గాలీపూర్ ప్రాథమిక పాఠశాలకు రూ.3.50లక్షలు మంజూరయ్యాయి. దీంతో పాఠశాలలో రెండు తరగతి గదులకు మరమ్మతులు చేయించారు. అన్ని తరగతి గదుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. సీలింగ్ ఫ్యాన్లను బిగించారు. కొన్ని తరగతి గదులకు స్లాబ్ మరమ్మతులు చేపట్టారు. తాగునీటి వసతి కల్పించేందుకు ట్యాంకును నిర్మించి నల్లాలను బిగించారు.
బాన్సువాడ రూరల్, డిసెంబర్ 5: బాన్సువాడ మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలుపుకొని 13 పాఠశాలలు, మున్సిపాలిటీ పరిధిలో తొమ్మిది పాఠశాలలను మన ఊరు – మన బడి కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. రంగులు వేయడం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలను కల్పించడం లాంటి పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంతో సర్కారు బడులు కార్పొరేట్ స్థాయిభవనాలుగా రూపుదిద్దుకుంటున్నాయి.
బాల్కొండ, డిసెంబర్ 5 : బాల్కొండ మండలంలోని నాగాపూర్, బోదేపల్లి, జలాల్పూర్, బస్సాపూర్, వన్నెల్(బీ), చిట్టాపూర్, బాల్కొండ తదితర పాఠశాలలు మన ఊరు – మన బడి మొదటి విడుతలో ఎంపికయ్యాయి. అందులో నాగాపూర్, బోదేపల్లి పాఠశాలల్లో పనులు పూర్తి చేసుకొని కలరింగ్కు సిద్ధంగా ఉన్నాయి.
కోటగిరి డిసెంబర్ 5: కోటగిరి మండల వ్యాప్తంగా 12 పాఠశాలలను ఎంపిక చేశారు. కొడిచెర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.8.92లక్షలు మంజూరు చేశారు. ఇందులో విద్యుత్ సౌకర్యం కోసం రూ. 2లక్షలు, తాగునీటి సౌకర్యానికి రూ.2లక్షలు, మరమ్మతులకు రూ.4లక్షలు కేటాయించారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తికాగా మరో 5శాతం అంటే పాఠశాలకు రంగులు వేయాల్సి ఉన్నది. మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తికానున్నాయి.
డిచ్పల్లి, డిసెంబర్ 5: డిచ్పల్లి మండలంలో మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో మొత్తం 22 పాఠశాలలు ఎంపికయ్యాయి. మెంట్రాజ్పల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్తిస్థాయిలో విద్యుద్దీకరణ, తాగునీటి సౌకర్యానికి సంబంధించిన పనులు చేపట్టారు. ప్రస్తుతం 100 శాతం పనులు పూర్తయ్యాయి. నూతనంగా తాగునీటి ట్యాంకును నిర్మించి నల్లాలు ఏర్పాటు చేశారు. మండలంలో ఎంపికైన మిగతా బడుల్లో 80శాతం పనులు పూర్తికావడం విశేషం.
మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. త్వరలో పెయింటింగ్ పనులు పూర్తికానున్నాయి. ప్రస్తుతం నీటి వసతి, విద్యుత్ సమస్య, తరగతి గదుల మరమ్మతులు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్య కూడా తీరడంతో విద్యార్థులు సంతోషంగా ఉన్నారు.
– వీరేందర్, ఉపాధ్యాయుడు, గాలీపూర్(నిజాంసాగర్)
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి హర్షణీయం. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో ఇప్పటి వరకు విద్యుద్దీకరణ, తాగునీటి పనులు చేసుకున్నాం. త్వరలో పాఠశాల భవనాలకు మరమ్మతులు, రంగులు వేసే కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాం.
– సుంకెట మహిపాల్, ఎస్ఎంసీ చైర్మన్, సీతాయిపేట్
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు – మన బడి పథకాన్ని అమలు చేస్తున్నది. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుండడంతో పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు. గతంలో కరెంట్లేక దోమలతో ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో తరగతి గదిలో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశాం.
– భాస్కర్రావు, ప్రధానోపాధ్యాయుడు, సదాశివనగర్