ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బియ్యం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పదిరోజుల్లోనే క్వింటాలుకు రూ. 500 నుంచి రూ.800 వరకు ధరలు పెరిగాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాడే బీపీటీ, సోనా మసూరి వంటి బియ్యం ధరలు కిలోకు రూ.5 నుంచి రూ.8 మేరకు పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఇప్పటికే పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యం కూరల్లో వాడే ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరలు రెట్టింపయ్యాయి. బియ్యం ధరల పెరుగుదల కారణాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వానాకాలానికి సంబంధించిన కొంతమేర ధాన్యం కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ర్టాలకు తరలింది. ఇదే అదనుగా రైస్మిల్లర్లు, ట్రేడర్లు సైతం కృత్రిమ సృష్టిస్తున్నారా అన్న దిశలో ప్రభుత్వం విచారణ జరిపాల్సిన అవసరం ఉంది. అదే, నిజమైతే బియ్యం బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించకపోతే మున్ముందు బియ్యం ధరలు మరింతగా పెరిగే ప్రమాదమున్నది.
బోధన్, డిసెంబర్ 17 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూలేని విధంగా ఒక్కసారిగా పెరిగిన బియ్యం ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నా యి. తెలంగాణ అన్నపూర్ణగా పేరొందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ధాన్యం ఉత్పత్తి, సరాసరి వరి దిగుబడిలోనూ ఎంతో ముందుంది. ఇటువంటి జిల్లాలో గుప్పెడు బియ్యం కోసం సామాన్యులు పరితపించాల్సిన పరిస్థితి ఏర్పడనుందా అన్నవిధంగా బియ్యం ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. పదిరోజుల్లోనే బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో ఇంత స్వల్ప వ్యవధిలో బియ్యం రేట్లు పెరిగిన దాఖలాలు లేవు. వివిధ వెరైటీలు, పాత, కొత్త బియ్యం రకాలను బట్టి ధరలు క్వింటాల్కు రూ. 500 నుంచి రూ.800 వరకు వారం రోజుల వ్యవధిలో పెరిగాయి. బీపీటీ, సోనా మసూరీ బియ్యం ధరలు క్వింటాల్కు వారం, పది రోజుల కిందట రూ.5000 వరకు ఉండగా, ప్రస్తుతం ఆ ధర 5,500 మేరకు పెరిగింది. ఇక పాత సోనా మసూరి బియ్యం ధరలు క్వింటాల్కు రూ.6000 లకు పెరగడం గమనార్హం.. ఇక హెచ్ఎంటీ బి య్యం ధర గత వారం రోజులకిందట రూ.6000 ఉండగా, ఒక్కసారిగా రూ.6,700లకు పెరిగింది. జైశ్రీరామ్ రూ.6000 నుంచి రూ.7,500లకు పెరిగింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాడే బీపీటీ, సోనా మాసూరి వైరైటీల ధరలు కిలోకు రూ.5 నుంచి 8 రూపాయల మేరకు పెరగడం గమనార్హం. బియ్యం ధరలు ఆకాశానికి తాకుతుండడం సామా న్య, మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇప్పటికే పప్పుల ధరలు విపరీతంగా పెరిగా యి. నిత్యం కూరల్లో వాడే ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ధరలు రెట్టింపయ్యాయి. ఈ పరిస్థితుల్లో గు క్కెడు ముద్ద కోసం ఇబ్బందులు దాపురించనున్నా యా అన్న ఆందోళనను సామాన్యులు వ్యక్తంచేస్తున్నారు.
బియ్యం ధరల పెరుగుదల కారణాలపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి, గత పదేండ్లుగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా జరిగింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రికార్డులు సాధించే దశకు చేరుకున్న తెలంగాణలో బియ్యం ధరల పెరుగుదల ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రైస్మిల్లర్ల మాయాజాలం ఏమైనా ఇందులో ఉందా అన్న కోణంలోఆలోచనలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ వానాకాలం ధాన్యం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు తరలిపోయింది. ఇదే అదనుగా, ధరలు పెరగడానికి రైస్మిల్లర్లు కృత్రిమ సృష్టిస్తున్నారా అన్న దిశలో ప్రభుత్వం విచారణ జరిపాల్సిన అవసరం ఉంది. అదే, నిజమైతే బియ్యం బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.
ఆల్మట్టి డ్యామ్ నిండకపోవడంతో గడచిన వానాకాలం సీజన్లో కర్ణాటక రాష్ట్రంలోని వరి సాగుపై ప్రతికూల ప్రభావం చూపించింది. అక్కడి రైతులు వరిసాగుకు బదులు ఇతర పంటలపై దృష్టిని పెట్టారు. దీంతో కర్ణాటకలో బియ్యం కొరత ఏర్పడింది. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ధాన్యం ఉత్పత్తి పడిపోయింది. దీంతో ఈ సీజన్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వ్యాపారులు ఇక్కడికి వచ్చి ధాన్యం కొనుగోళ్లు చేశారు. దీంతో ఎక్కువ మొత్తం లో మన దగ్గర పండిన ధాన్యం కర్ణాటకకు తరలిపోయింది. కొంతమేరకు ఆంధ్రప్రదేశ్కు కూడా ధా న్యం రవాణా జరిగింది. పంట పొలాల్లోనే పచ్చి ధా న్యాన్ని అక్కడి వ్యాపారులు పోటీపడి జిల్లా రైతుల వద్ద కొనుగోలు చేశారు. దీంతో స్థానిక రైస్మిల్లులకు ధాన్యం తక్కువగానే దక్కింది. ఈ నేపథ్యంలో కొంతమేరకు ధాన్యం కొరత ఏర్పడింది. దీన్ని సాకుగా తీసుకుని రైస్మిల్లుల యజమానులు, బియ్యం ట్రేడర్లు కృత్రిమ కొరతను సృష్టించే అవకాశం లేకపోలేదు.. మున్ముందు బియ్యం ధరలు పెరుగుతాయన్న నమ్మకంతో ఈ విధమైన చర్యకు వారు ఒడిగట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఏదిఏమైనప్పటికీ, ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించకపోతే మున్ముందు బియ్యం ధరలు మరింతగా పెరిగే ప్రమాదముంది.
వారం పదిరోజులుగా బియ్యం ధరలు బాగా పెరిగాయి. కిలోకు రూ.5 నుంచి రూ. 9 వరకు ధర పెరిగింది. మన ధాన్యం కర్ణాటకకు తరలిపోయింది. దీంతో రైస్మిల్లులకు కూడా ధాన్యం కొరత ఏర్పడిన మాట వాస్తవం. అయితే, ఎందుకు బియ్యం ధరలు పెరుగుతున్నాయన్నది చెప్పలేం. మాలాంటి రిటైల్ వ్యాపారులకు గిరాకీ తగ్గిపోయింది. మా షాప్లో స్టాక్ కూడా అయిపోయింది. ఈ రేట్లకు భయపడి స్టాక్ను తెప్పించడంలేదు.
బియ్యం ధరలు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. దీంతో మాలాంటి మెస్లు, చిన్న హోటళ్లలో భోజనం తయారీకి ఖర్చులు పెరిగిపోతున్నాయి.. బియ్యం ధరలు ఇట్ల పెరిగితే.. హోటళ్లు నడపడం కష్టమవుతుంది. ఇప్పటికే ఉల్లి, వెల్లులి ధరలతో పాటు సరుకుల ధరలు పెరిగాయి. మెస్లు నడుపుకునేవారికి, కస్టమర్లకు కూడా ఈ బియ్యం ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రభుత్వం బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి..
బియ్యం ధర బాగా పెరిగింది. షాపుల్లో బియ్యం రేటు అడిగితే, గత నెలకు, ఇప్పటికీ ఎంతో తేడా కనిపించింది. మాలాంటి సామాన్యులు పెరిగిన ధరకు బియ్యం కొనాలంటే చాలా కష్టం.. ఇప్పటికే కందిపప్పు ధర పెరిగి కిలోకు రూ.180 అయ్యింది. ఈ ధరల పెరుగుదలను ప్రభుత్వం అరికట్టాలి.. లేకపోతే ఏం తినేటట్టు కనిపించడంలేదు.. ఈ ధరలను చూస్తుంటే..