వినాయక్నగర్, ఏప్రిల్ 15: వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరఢా ఝళిపించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఏకకాలంలో దాడులు చేశారు. 30 మందిపై కేసు నమోదు చేయడంతోపాటు భారీగా నగదును సీజ్ చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తూ అమాయకులను వేధింపులకు గురిచేస్తున్నట్లు సీపీ కల్మేశ్వర్ దృష్టికి వచ్చింది. పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని పలువురు వ్యాపారులు చక్రవడ్డీ రూపంలో వసూళ్లకు పాల్పడుతుండడం, డబ్బులు చెల్లించడంలో ఆలస్యమైతే రౌడీషీటర్లతో బెదిరించిన ఉదంతాలు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా వందల కోట్లలో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన సీపీ.. అక్రమార్కుల భరతం పట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం జిల్లావ్యాప్తంగా పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లలో సంబంధిత సీఐలు, ఎస్సైలు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు. అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న జాబితా ప్రకారం పలువురు వడ్డీ వ్యాపారుల ఇండ్లపై మెరుపుదాడి చేశారు. మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహించిన పోలీసులు 30 మంది వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంట్లో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన లక్షల రూపాయలను సీజ్ చేశారు. నగరంలో సీఐ నరహరి ఆధ్వర్యంలో ఎనిమిది ఇండ్లలో సోదాలు జరిపారు. త్రీ టౌన్ ఠాణా ప్రాంతంలో నివాసముండే మనం పుల్లయ్య, వనం పాపయ్య, అశోక్ అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరి నుంచి రూ.10.88 లక్షల నగదును సీజ్ చేసినట్లు తెలిసింది.
వడ్డీ వ్యాపారం చేస్తున్న పలువురు జనం అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పు ఇచ్చే ముందే రుణగ్రహీతల నుంచి ష్యూరిటీల రూపంలో అనేక పత్రాలు తీసుకుంటున్నారు. ప్రామిసరీ నోట్లు, తెల్ల కాగితాలతో పాటు ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకోవడం, ఏటీఎం కార్డులు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఆస్తిపత్రాలు, పట్టా పాస్బుక్కులు తీసుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా ప్లాట్లు, వ్యవసాయ భూములను తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే అప్పు ఇస్తుండడం గమనార్హం. డబ్బులు చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే చాలు ఇండ్ల మీద పడిపోతున్నారు. ఇంట్లో మహిళలు, పిల్లలు ఉన్నా చూడకుండా అప్పు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే వడ్డీ వ్యాపారుల ఒత్తిడికి తాళలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గతంలో నిజామాబాద్కు చెందిన ఓ కుటుంబం విజయవాడకు వెళ్లి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పు ఇచ్చిన వారి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్నోట్లో పేర్కొనడం.. వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టింది. అప్పట్లో అక్రమ వ్యాపారంపై మొక్కుబడిగా చర్యలు చేపట్టిన పోలీసులు ఆ తర్వాత వదిలేశారు. మరోవైపు, తాజా తనిఖీల గురించి ముందుగానే సమాచారం అందుకున్న కొందరు వ్యాపారులు అప్రమత్తమయ్యారు. తమ వద్ద ఎలాంటి ఆనవాళ్లు లేకుండా వేరేచోటుకు తరలించినట్లు తెలిసింది.