ఆర్మూర్టౌన్, ఏప్రిల్ 1: ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి పడింది. సోమవారం తెల్లవారుజామున కెనాల్ కట్ట తెగిపోయి పక్కనే ఉన్న జర్నలిస్టు కాలనీలోకి ఒక్కసారిగా నీళ్లు వచ్చిచేరాయి. ఆకస్మిక నీటి ప్రవాహంతో ఆరుబయట నిద్రిస్తున్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరికొందరు ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. వెంటనే ఇరిగేషన్ సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న నీటిని నిలిపివేశారు. వరద ప్రవాహానికి చాలా మంది ఇండ్లలోని సామగ్రి కొట్టుకుపోయింది. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టు కాలనీలోకి వరద చేరుకోవడంతో విషయం తెలుసుకున్న జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్, ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలువలోని నీటిని ఖాళీ చేయించి అవసరమైన పనులను యుద్ధప్రాతిపదికన చేయించాలని సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఘటన విషయమై కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి అవసరమైన పనులు చేపట్టాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రాజు, డిప్యూటీ ఈఈ కృష్ణమూర్తి, బబ్లూ,శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఇరిగేషన్, ఇతర అధికారుల నిర్లక్ష్యంతోనే కెనాల్ కట్ట తెగి ఇండ్లలోకి నీరు చేరిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంటలకు నీటిని వదిలే ముందు నిజాంసాగర్ ప్రధాన కాలువను శుభ్రం చేయించాల్సిన అవసరమున్నా, ఆర్మూర్ ప్రాంతంలోని ఇరిగేషన్ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాలువ మురికి కూపంలా తయారై, చెత్తాచెదారాలతో నిండిపోయి దర్శనమిస్తుందన్నారు.