కోటగిరి, నవంబర్ 23: పొతంగల్ మండలం కావాలని మంజీరా పరీవాహక ప్రాంత ప్రజల ఏండ్లుగా కంటున్న కల.. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో నెరవేరింది. 1986-87లో కోటగిరి మండలం అయ్యే సమయంలోనే మంజీర తీర వాసులు పొతంగల్ను మండలం చేయాలని విన్నవించగా నాటి పాలకులు పట్టించుకోలేదు. అనాటి నుంచి తమ గోడును విన్నవించినా పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వచ్చాక కొత్త మండలాల ఏర్పాటుతోపాటు పొతంగల్ను మండలంగా ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. మంజీర తీర వాసుల కల నెరవేరింది.
పొతంగల్ మండలం 14 గ్రామ పంచాయతీలతో ఏర్పాటు కాగా ఇక నుంచి తమకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు ఏర్పడనున్నాయని ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యం కానున్నదని ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మూడు రాష్ర్టాల నుంచి పొతంగల్కు రాకపోకలు జరుగుతున్నాయి. పొతంగల్ పక్కనే మహారాష్ట్రతోపాటు కర్ణాటక రాష్ట్రం ఉంది. దీంతో నిత్యం అక్కడి వారు పొతంగల్కు రావడంతో వ్యాపారాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. పొతంగల్ మండలం ఏర్పాటుతో మంజీరా తీర ప్రజలు సంబురపడుతున్నారు.
మండలాల ఏర్పాటుతో ప్రజలకు మరింత చేరువలో సేవలు అందనున్నాయి. నిన్నటి వరకు ఏ చిన్న పని ఉన్నా కోటగిరికి వెళ్లాల్సి వచ్చేది. ఇక సమస్య తీరింది. మండల స్థాయి పను లు పొతంగల్లో పరిష్కారం కానున్నాయి.
– సిద్దిరాంరెడ్డి, పొతంగల్ వాసి
పొతంగల్ మండలం కావాలని 25 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కేసీఆర్తో మాట్లాడి పొతంగల్ మండలం అయ్యేలా చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డికి కృతజ్ఞతలు.
– కాశాగౌడ్, మాజీ సర్పంచ్ పొతంగల్
కొత్తగా ఏర్పడిన పొతంగల్ మండలం భవిష్యత్లో మరిం త అభివృద్ధి చెందుతుంది. సమీపంలోనే మంజీరా నది ఒడ్డుకు అవతలి వైపు మహారాష్ట్ర ఉన్నది. అక్కడి ప్రజలు, వ్యాపారులు ఇక్కడికి రావడంతో పొతంగల్ మరింత అభివృద్ధి సాధిస్తుంది.
-భూమయ్య, పొతంగల్ గ్రామస్తుడు
పొతంగల్ మండలం ఏర్పా టు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. మండల ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.
-వర్ని శంకర్, సర్పంచ్ పొతంగల్