దళితజాతి సమగ్ర వికాసం కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల వెలుగులో ఊపిరిపోసుకున్నది దళితబంధు పథకం. దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పునకు నాంది పలికింది. దళితవాడల్లో నెలకొన్న దారిద్య్రాన్ని సమూలంగా పారదోలుతున్నది. దళితజాతికి సంపూర్ణమైన ఆర్థిక, సామాజిక మద్దతును అందించేలా రూపొందించిన ఈ పథకం.. వెలివాడలను వెలుగువాడలుగా మారుస్తున్నది. పేదరికంలో అణగారిన దళితజాతి స్వశక్తితో, స్వావలంబనతో, ఆత్మగౌరవంతో జీవించేందుకు తోడ్పాటును అందిస్తున్నదీ తెలంగాణ దళితబంధు. అంబేద్కర్ ఆశయాలకు ప్రతిబింబమై అణగారిన ప్రజల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తున్నది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.17700 కోట్లను కేటాయించడంపై దళితజాతి హర్షం వ్యక్తంచేస్తున్నది. మరిన్ని కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందిస్తున్న ప్రభుత్వానికి ఇదివరకే లబ్ధిపొందిన కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
నిజాంసాగర్, ఫిబ్రవరి 13: ఎన్నో కష్టాలు.. అడుగడుగునా వివక్ష.. తరతరాలుగా అట్టడుగు వర్గంలోనే బతుకులీడుస్తున్న బడుగుల జీవన విధానాన్ని దళితబంధు పథకం సమూలంగా మార్చింది. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా దళిత కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. స్వయం ఉపాధి పొందుతూ మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నాయి. కూలీలు, గుమస్తాలు, డ్రైవర్లుగా బతుకీడ్చిన వారు నేడు ఓనర్లుగా మారి సమాజంలో తలెత్తుకొని జీవిస్తున్నారు. వెనుకబడిన దళిత కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు అందిస్తూ వారి భవితకు చక్కని బాటలు వేశారు. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించడమే దళితులపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనం. ప్రతి దళిత కుటుంబం లక్షాధికారిగా మారాలె.. తలెత్తుకొని సమానంగా బతకాలె అన్న నినాదంతో ప్రారంభించిన ఈ పథకం సత్ఫలితాలను ఇస్తున్నది.
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా మండలంలోని 1298 కుటుంబాల బతుకులు పూర్తిగా మారిపోయాయి. దళితబంధు పథకం ద్వారా యూనిట్లు పొందిన వారంతా ప్రస్తుతం వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ పథకం.. తమను లక్షాధికారులను చేసిందని లబ్ధిదారులు చెబుతున్నారు. తాజాగా ప్రకటించిన బడ్జెట్ కేటాయింపులతో రాష్ట్రంలోని మరిన్ని కుటుంబాల్లో కూడా వెలుగులు ప్రసరిస్తాయని హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ జీవితాలు మారినట్లుగానే మరిన్ని కుటుంబాల జీవితాలు కూడా ఆర్థికంగా నిలబడతాయని ఆనందపడుతున్నారు.
నేను ఓ ఫెర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. నాకు పది లక్షల రూపాయలతో దళితబంధు పథకం యూనిట్ను అందజేశారు. నేను ఫెర్టిలైజర్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నా. ఆరు నెలల కిందట దుకాణం పెట్టుకుంటే సుమారు మూడు లక్షల వరకు ఆదాయం వచ్చింది. కేసీఆర్ దయతో దళితబంధు యూనిట్ను అందుకొని సొంతంగా ఫెర్టిలైజర్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని హాయిగా బతుకుతున్నా.
– అశోక్, మాగి, నిజాంసాగర్
మాకు వ్యవసాయ భూమి లేదు. కేవలం కూలీ పనులు చేసుకుంటూ బతికేవాళ్లం. అలాంటిది దళితబంధు పథకంతో పది లక్షల రూపాయలు అందడంతో పాడి గేదెలను పెంచుతూ పాల వ్యాపారం చేస్తున్నాం. రోజుకు వెయ్యి చొప్పున నెలకు రూ.30వేల ఆదాయం వస్తున్నది. పాడి గేదెలను సాకుతూ సంతోషంగా జీవిస్తున్నాం. అందరిలాగా తలెత్తుకొని బతికేలా సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు దేవుడితో సమానం.
– విజయ, సుల్తాన్నగర్, నిజాంసాగర్
సీఎం కేసీఆర్ దళితుల పాలిట దేవుడు. దళితులందరికీ మా మండలంలో పది లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. బడ్జెట్లో మళ్లీ రూ.17700 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని అన్ని మండలాలకు దళితబంధు పథకాన్ని అందించనున్నారు. మాలాంటి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెండో విడుతలో దళితబంధు పథకం అందిస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. ఇలాంటి సీఎం ఉండడం మేము చేసుకున్న పుణ్యం.
– చిన్న సాయిలు, మల్లూర్, నిజాంసాగర్
దళితబంధు పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం సంతోషకరం. ఈ పథకం ప్రతి దళిత కుటుంబానికి అందనున్నది. ఇప్పటికే నిజాంసాగర్ను పైలట్ మండలంగా ఎంపిక చేసి ప్రతి కుటుంబానికి ఈ పథకం అందజేయడంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. మళ్లీ బడ్జెట్లో కేటాయించిన నిధులతో మరికొందరికి ఈ పథకం అందుతుంది.
– సుధాకర్, సుల్తాన్నగర్, నిజాంసాగర్