నిజామాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ఊరించి ఉసూరుమనిపించింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కారు.. వాటి అమలులో విఫలమైంది. మహిళలకు ఫ్రీ బస్ మినహా మిగతా వాటి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుభరోసా, చేయూత, యువ వికాసం, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు పేరిట ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్.. వాటిలో అంతర్భాగంగా అనేక హామీలను చేర్చింది. రూ.2 లక్షల పంట రుణమాఫీ, కౌలురైతులకు ఆర్థిక సాయం, ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 చొప్పున పింఛన్లు, సామాజిక పింఛన్ల పెంపు తదితర వరాలెన్నో కురిపించింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వాటన్నింటినీ అమలు చేస్తామని చెప్పిన హస్తం పార్టీ.. ఆచరణలో విఫలమైంది.
డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఆ రోజు సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక హామీలు ఇచ్చిన పీసీసీ చీఫ్.. అమలు చేసే తేదీలతో సహా ప్రకటించారు. డిసెంబర్ 9వ తేదీన ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ఆ రోజే రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అనేక బహిరంగ సభల్లో స్పష్టంగా చెప్పారు. అంతేకాదు రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దని రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. రుణాలు చెల్లించిన వారు సైతం తిరిగి కొత్త లోన్లు తెచ్చుకోవాలని, పంట రుణాలు తీసుకోని వారు సైతం తీసుకోవాలని సూచించారు. రూ.లక్ష లోపు పంట రుణం ఉన్న వారు సైతం రూ.2 లక్షలు తీసుకోవాలని, తాము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే, డిసెంబర్ 9వ తేదీన రుణాలు మాఫీ చేస్తామని తేదీతో సహా చెప్పిన రేవంత్రెడ్డి.. అమలు చేయడంలో విఫలమయ్యారు. మార్చి నెలాఖరు వస్తున్నా రుణమాఫీ ఊసే ఎత్తడం లేదు.
కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రం విజయవంతమైంది. మహిళల నుంచి మంచి స్పందన లభించింది. అయితే, రద్దీ పెరిగిన నేపథ్యంలో అందుకు తగిన విధంగా బస్సులను నడపడంలో ఆర్టీసీ విఫలమవుతున్నది. పెరిగిన ఆక్యుపెన్సీ ప్రకారం బస్సులు నడపలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండలాలకు, జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. డిమాండ్కు తగినట్లుగా బస్సులు లేక మహిళలు ప్రమాదకర రీతిలో ఫుట్బోర్డుపై నిల్చుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. బస్సుల కోసం సాలూర మండల కేంద్రంలో కాలేజీ విద్యార్థులు ఇటీవల ధర్నాకు దిగడం గమనార్హం.
యువ వికాసం పేరిట విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారం చేపట్టి వంద రోజులు దాటినా ఆ దిశగా చేపట్టిన చర్యలు శూన్యం. ఇక, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కొన్ని శక్తులు ఇప్పుడు కనుమరుగయ్యాయి. కేసీఆర్ సర్కారుకు చెడ్డ పేరు తెచ్చేందుకు గతంలో చీటికి మాటికి కోర్టు మెట్లు ఎక్కి నోటిఫికేషన్లు, పరీక్ష తేదీల రద్దు కోరుతూ కల్పిత ఆందోళనలతో ఇబ్బందులు సృష్టించిన వారంతా.. కాంగ్రెస్ అధికారంలోకి తెరమరుగయ్యారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలను ప్రకటించి, అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్నది. నర్సింగ్ ఆఫీసర్లు, పోలీస్ కానిస్టేబుళ్లు, గురుకుల నియామకాల్లో భర్తీ చేసిన 28 వేల ఉద్యోగాలను తమ గొప్పదనంగా చెప్పుకుంటున్నది.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అర్హులైన మహిళలందరికీ రూ.2500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ నెలకు రూ.2500 చెల్లిస్తామని ఊదరగొట్టారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆర్థిక సాయం అందించడంలో అడుగు ముందుకు వేయలేదు. అధికారంలోకి వంద రోజులు దాటింది కదా.. పింఛన్ల సంగతేమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇక సామాజిక పింఛన్లను పెంచుతామన్న రేవంత్రెడ్డి మాట నిలబెట్టుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల పెన్షన్లను అధికారంలోకి రాగానే రూ.4 వేలు చేస్తామన్నారు. కానీ అమలు చేయలేక చేతులెత్తేశారు. ఇక ఇటీవల ప్రారంభించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో అనేక లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. సగం మందికి కూడా జీరో బిల్లులు రాలేదు. దీంతో వారంతా మండలాఫీసుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఎన్నికల హామీల్లో ఒకటైన రూ.500లకే వంటగ్యాస్ పథకం ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించినా ఉమ్మడి జిల్లాలో అమలులోకి వచ్చిన దాఖలాల్లేవు.
ఎన్నికల ముంగిట రైతు భరోసా పేరిట అన్నదాతలపై వరాలు కురిపించిన హస్తం పార్టీ అమలులో రిక్త‘హస్తం’ చూపింది. రైతుబంధు సాయం రూ.15 వేలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రూ.10వేల పెట్టుబడి సాయాన్ని అందించడంలోనూ విఫలమైంది. యాసంగిలో ఇవ్వాల్సిన రైతుబంధు.. ఇప్పటికీ వేలాది మంది రైతులకు అందలేదు. మూడెక రాల లోపు ఉన్న వారికి మాత్రమే ఆర్థిక సాయం అందించి కాంగ్రెస్ సర్కారు చేతులు దులుపుకొన్నది. మిగతా వారికి ఎప్పుడిస్తారనే స్పష్టత కూడా లేదు. మరోవైపు, రైతుబంధు పథకంలో అనేక కొర్రీలు పెట్టడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం కుదించేందుకు సర్కారు సన్నాహాలు చేపట్టింది. కౌలు రైతులకు సైతం రూ.12 వేలు ఇస్తామన్న కాంగ్రెస్.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్గానే మారింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు ఊపందుకుంటున్నాయి. మరికొద్ది రోజుల్లో మిగతా చోట్ల ప్రారంభం కానున్నాయి. అయినప్పటికీ బోనస్ విషయంలో సర్కారు నుంచి స్పందన కరువైంది.