నిజామాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి ముసాయిదా మాస్టర్ ప్లాన్పై భారతీయ జనతా పార్టీ క్షుద్ర రాజకీయాలకు తెరలేపింది. పాలకవర్గం ఆమోదం పొందని మాస్టర్ప్లాన్ను బూచీగా చూపించి వ్యవసాయ భూములు లాక్కుంటున్నారంటూ భయాందోళనలు సృష్టిస్తున్నది. అన్నదాతల అభ్యంతరాలు, ప్రజల సూచనల మేరకే బృహత్ ప్రణాళిక ఉంటుందన్న ప్రభుత్వ ప్రకటనను సైతం పట్టించుకోకుండా కావాలనే రైతులను రెచ్చగొడుతున్నది.
ప్రభు త్వం నుంచి స్వయంగా మంత్రి కేటీఆర్ తక్షణమే రైతు ల ఆందోళనపై స్పందించారు. మాస్టర్ప్లాన్ ఇంకా ము సాయిదా దశలోనే ఉందని, అందరి అభిప్రాయాల మే రకే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు, జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సైతం అభ్యంతరాలను స్వీకరిస్తామని ప్రకటన చేశారు. ముసాయిదాతో ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా ప్రభుత్వానికి వినతులు సమర్పించేందుకు రావాల్సి ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అందుకు విరుద్ధంగా సామాన్యులను పక్కదారి పట్టిస్తుండడం వెనుక దాగి ఉన్న కుట్ర కోణం అందరికీ అర్థమమతూనే ఉన్నది.
వాస్తవానికి రైతు జేఏసీ పిలుపు ఇచ్చిన కామారెడ్డి బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎటువంటి చిన్న ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. అయితే, సాయంత్రం వేళ బండి సంజయ్ కామారెడ్డికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం సాయంత్రం బీజేపీ శ్రేణులతో హైదరాబాద్ నుంచి వచ్చిన బండి సంజయ్ రాత్రి 7 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ వద్ద నానా హంగామా సృష్టించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రేణులను వెంటేసుకుని లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. గేటు దాటేందుకు కొంత మంది ప్రయత్నించగా, పోలీసులు ఎక్కడికక్కడే నిలువరించారు. కొద్దిసేపటి తర్వాత సంజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ను అక్కడ్నుంచి తరలించారు.
ఈ సందర్భంగా పోలీస్ వాహనాలపై బీజేపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. గురువారం జరిగిన రైతు దీక్షకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వచ్చి రైతులను రెచ్చగొట్టగా, వరుసగా రెండో రోజు ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా రంగ ప్రవేశం చేసి ఉద్రిక్తతలను పెంచారు. మాస్టర్ప్లాన్ డ్రాఫ్ట్పై అభ్యంతరాలను తెలపాలని రైతులకు అవగాహన కల్పించాల్సింది పోయి రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తుండడం గమనార్హం. బండి సంజయ్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికే సరిపోయింది తప్పితే ముసాయిదాపై ఏవిధంగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలపాలన్న అంశాన్ని గాలికొదిలేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
కామారెడ్డి నియోజకవర్గంలో వరుసగా ఓటమి పాలై కంగుతింటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ శుక్రవారం బీజేపీ నాయకులు ఇచ్చిన బంద్లో పాల్గొనడంతో ఇరు పార్టీల దోస్తీ బయట పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. కామారెడ్డి మాస్టర్ప్లాన్ వ్యతిరేక కార్యక్రమాల్లో కమలం, కాంగ్రెస్ పార్టీల ద్వంద్వ నీతిని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. మొన్నటి వరకు పరస్పర ఆరోపణలతో తిట్ల దండకం ఎత్తుకున్న వారంతా కలిసి బంద్లో పాల్గొనడమేమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. బృహత్ పట్టణ ప్రణాళికలో షబ్బీర్ అలీకి సంబంధించిన భూములు సురక్షితంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ నాయకుల అక్రమాలపై విమర్శలు చేసింది.
ప్రభుత్వ కాలేజీ భూముల వ్యవహారంలో బీజేపీ నేతల హస్తం ఉందంటూ విమర్శించారు. రైతు జేఏసీ పేరిట బీజేపీ నేతలిచ్చిన కామారెడ్డి బంద్లో స్వయంగా కాంగ్రెస్ ముఖ్య నాయకుడు షబ్బీర్ అలీ పాల్గొనడం, బంద్కు సంఘీభావం తెలపడం చర్చనీయాంశమైంది. జాతీయ రాజకీయాల్లో ఉప్పు, నిప్పుగా ఉండే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కామారెడ్డి గల్లీలో మాత్రం దోస్తీ కట్టడం వెనుకున్న ఆంతర్యం ఏమిటో సులువుగానే తెలిసి పోతున్నది. రైతు ప్రభుత్వంగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి రెండు పార్టీలు ఉమ్మడిగా చేస్తున్న రాజకీయ కుట్ర అందరికీ అర్థమవుతున్నది.