నిజామాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఆర్మూర్ మున్సిపల్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అవిశ్వాస తీర్మానం నెగ్గిందని అధికారికంగా ప్రకటించాక, ఇప్పుడు పిల్లిమొగ్గలు వే స్తుండడం చర్చనీయాంశమైంది. మున్సిపల్ చైర్పర్సన్ పదవిలో ఉన్నారో.. లేరో తెలియక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. అసలు ఈ గందరగోళానికి బాధ్యులు ఎవరన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఉన్నతాధికారుల సమక్షంలో అత్యంత సాఫీగా జరగాల్సిన ప్రక్రియ తీవ్ర వివాదాస్పదం కావడం విస్తుగొల్పుతున్నది. చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నిబంధనలను అమలుచేయాల్సిన వారే పప్పులో కాలేసి తీవ్రమైన పాలన సంక్షోభాన్ని సృష్టించడం గమనార్హం. అధికారులు, రాజకీయ నేతలు ఇష్టారాజ్యంగా ఎవరికి తోచినట్లు వారు వ్యవహరించడంతో గందరగోళం ఏర్పడింది. వాస్తవానికి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేపట్టాలంటే ఎంత మంది సమావేశానికి హాజరు కావాలి.. తీర్మానానికి ఎంత మంది మద్దతు ఉండాలి? అందులో ఎవరెవరిని విశ్వాసంలోకి తీసుకోవాలి? కొత ్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఏమిటి? తదితర వివరాలేవి పట్టించుకోకుండా అవిశ్వాస ప్రక్రియను అమలు చేసి, నిలుపుదల చేస్తుండడం అనుమానాలకు తావిస్తున్నది. రాజకీయ జోక్యం కారణంగానే ఈ దుమారం రేగిందన్న చర్చ జరుగుతున్నది.
ఆర్మూర్ మున్సిపాలిటీ అవిశ్వాస ఎపిసోడ్లో రెండు రకాల ప్రకటనలు రావడం విస్మయానికి గురి చేస్తున్నది. జనవరి 4వ తేదీన అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇద్దరు స్వతంత్రులు కలిపి మొత్తం 24 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఇక, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి పాల్గొన్నారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లలో 2/3 వంతు (24 మంది) హాజరుకావడంతో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు. 24 మంది తీర్మానానికి మద్దతుగా చేతులెత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అదేరోజున అధికారికంగా వెల్లడించారు. మున్సిపల్ చైర్పర్సన్ తన పదవిని కోల్పోయినట్లు డిసిగ్నేటెడ్ ఆఫీసర్ హోదాలో ఆర్డీవో వినోద్కుమార్ ప్రకటించారు. ఇదే అంశాన్ని కలెక్టర్కు నివేదిక రూపంలో పంపించారు. పురపాలక శాఖ, ఎన్నికల సంఘానికి సైతం అవిశ్వాసం నెగ్గినట్లు సమాచారాన్ని చేరవేశారు. జనవరి 16న ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ సైతం ప్రభుత్వానికి పంపిన లేఖలోనూ అవిశ్వాసం నెగ్గినట్లు సంతకం చేశారు. ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మాన ప్రతిని ఆధారం చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్ సైతం జనవరి 22న నూతన చైర్మన్ ఎన్నికను చేపడుతున్నట్లుగా బదులిచ్చారు.
అంటే మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత తన పదవిని కోల్పోయినట్లు జనవరి 22వ తేదీ దాకా అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. కానీ ఏం జరిగిందో కానీ.. 22వ తేదీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సిన తరుణంలో.. అవిశ్వాస ప్రక్రియ వీగిపోయినట్లు ప్రకటనలు రావడంతో గందరగోళం ఏర్పడింది. అసలేం జరిగిందో తెలియక కౌన్సిలర్లు సైతం తికమక పడుతున్నారు. ఇది ముమ్మాటికీ చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందంటూ వారంతా మండిపడుతున్నారు. అవిశ్వాసం నెగ్గిందని ఆ రోజు ప్రకటించిన అధికారులు.. ఇప్పుడు అవిశ్వాసం వీగిపోయిందని వస్తున్న వార్తలపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు. చట్టంలోని నిబంధనలను ఒకసారి అమలుచేసి, వెనక్కి తీసుకోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీవోతో పాటు ఉన్నతాధికారులు సైతం పొరపాట్లు చేసి అందరినీ గందరగోళంలోకి నెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల జోక్యంతోనే ఇదంతా జరుగుతున్నదని కౌన్సిలర్లు, ప్రజలు అనుమానిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సారథ్యంలో జరిగిన అవిశ్వాస తంతు విజయవంతమైతే ఎక్కడ తమ పరువు పోతుందోననే ఆలోచనతోనే.. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ నాయకుడు ఇదంతా చేయిస్తున్నారన్న చర్చ నడుస్తున్నది. కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పైడి రాకేశ్రెడ్డి సైతం అవిశ్వాస ప్రక్రియలో పాల్గొన్నారు. ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు కలిగి ఉన్న ఎమ్మెల్యే ఓటు వేయకుండానే తటస్థంగానే ఉన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత బయటికి వచ్చిన ఆయన.. అవినీతి ఓడిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎమ్మెల్యే ఓటు విషయంలో గందరగోళం చోటు చేసుకుంటుండగా, ఆయన చేతులు ఎత్తక పోవడంతోనే అవిశ్వాసం వీగినట్లుగా ప్రచారం జరుగుతున్నది. అవిశ్వాస తీర్మాన సమావేశంలో ఎమ్మెల్యే ఓటును పరిగణనలోకి తీసుకోలేదు. 24మంది ఓట్లతో మెజార్టీ వచ్చినట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం రాజకీయ జోక్యం మూలంగా ఎమ్మెల్యే ఓటును జోడించారు. దీంతో కౌన్సిలర్లు 36 మంది, ఎమ్మెల్యే కలిపితే 37 మంది అవుతున్నారు. ఇందులో 2/3 మెజార్టీ అంటే 25 మందిగా ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ మేరకు కలెక్టర్కు ఆదేశాలు సైతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల జోక్యం మూలంగానే ఇంతటి హైడ్రామా జరిగినట్లుగా ఆర్మూర్ పట్టణ వాసులు బహిరంగంగానే చెబుతున్నారు.
అవిశ్వాసం విషయంలో కుట్ర జరుగుతున్నదని బీజేపీ మున్సిప ల్ ఫ్లోర్ లీడర్ నర్సింహారెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అవిశ్వా సం నెగ్గిందని ప్రకటించిన నెల తర్వాత ఇప్పుడు వీగిపోయింద నడం హాస్యాస్పదమన్నారు. ఇంతటి సంక్షోభానికి కారణమైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఆర్మూర్ మున్సిపాలిటీలో డ్రామా జరుగుతున్నప్పటికీ ఈ వ్యవహారంపై అధికారులెవ్వరూ స్పష్టత ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు, చైర్పర్సన్ వినీత సోమవారం మున్సిపాలిటీకి వచ్చితానే చైర్మన్ అని ప్రకటించుకున్నారు. ఈమెకు దీటుగా 24మంది కౌన్సిలర్లు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపడుతూ మున్సిపాలిటీలోనే సమావేశమై ప్రకటన విడుదల చేశారు. ఇరువర్గాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణానికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చేష్టాలుడిగి చూస్తున్నది. మొత్తానికి అవిశ్వాస ప్రక్రియ మూలంగా కాంగ్రెస్ నేతల జోక్యంతో ఆర్మూర్ బల్దియాలో పరిపాలన స్తంభించింది. పట్టణవాసులకు అందాల్సిన ప్రజాసేవలు అందడంలో వైఫల్యం, జాప్యం జరుగుతున్నది. ఇంత జరుగుతున్నప్పటికీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం నోరు మెదపడం లేదు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన పైడి రాకేశ్రెడ్డి అవిశ్వాస తీర్మానంలోని నాటకీయతపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం.