కామారెడ్డి, మార్చి 27 : ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో బుధవారం ఉదయం ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్’ అనే నినాదంతో నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్లో నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కామారెడ్డిలో కలెక్టర్ మాట్లాడుతూ..అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. ఓటు వజ్రాయుధం వంటిదని ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దన్నారు. ఏప్రిల్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని,పోలింగ్ శాతాన్ని పెంచడానికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో ఎస్పీ సింధూశర్మ, ఆర్డీవో రఘునాథ్రావు, సీపీవో రాజారాం, ఎన్నికల నోడల్ అధికారి వెంకటేశ్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కార్యదర్శి సాయిలు,టీజీవో అధ్యక్షుడు దేవేందర్,ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఖలీల్వాడి, మార్చి 27 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 5 కే రన్లో వివిధ శాఖల అధికారులతోపాటు డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు విద్యార్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, యువతీయువకులు భాగస్వాములయ్యారు. పాత కలెక్టరేట్ నుంచి చేపట్టిన 5కే రన్ ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ఓల్డ్ కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగింది. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శంకర్, స్వీప్ నోడల్ అధికారి సురేశ్కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, మున్సిపల్ అధికారి రమేశ్ పాల్గొన్నారు.