హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఎం ఉదయ్ కృష్ణారెడ్డిని రాజేంద్రనగర్/ఉప్పర్పల్లి కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు అత్తాపూర్ పోలీస్స్టేషన్ అధికారుల సమక్షంలో, ఉమెన్ సేఫ్టీ వింగ్ విచారణాధికారుల పర్యవేక్షణలో గురు, శుక్రవారాల్లో ఆయనను విచారించనున్నారు. పోలీస్ కస్టడీ గడువు ముగిసిన అనంతరం, నిందితుడికి ఉస్మానియా జనరల్ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి రాజేంద్రనగర్/ఉప్పర్పల్లి కోర్టు ఎదుట హాజరుపరుచనున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేసు విచారణ వేగంగా కొనసాగుతున్నదని పోలీస్ వర్గాలు తెలిపాయి.