కామారెడ్డి, డిసెంబర్ 4 : ప్రజల తీర్పును శిరసావహిస్తామని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన సభ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కేసీఆర్ ఓడిపోయారని.. ప్రజల తీర్పును శిరసావహిస్తామని అన్నారు. పార్టీలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో తప్పకుండా సమీక్షించుకుంటామని అన్నారు. భవిష్యత్తులో బలమైన ప్రతిపక్షంగా కామారెడ్డిలో బీఆర్ఎస్ నిలబడుతుందని అన్నారు. 2009 లో తెలుగు దేశం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సుమారు 15 సంవ్సరాలుగా కామారెడ్డి శాసనసభ సభ్యుడిగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నానని.. కామారెడ్డికి సీఎం కేసీఆర్ సహకారంతో పుష్కలంగా నిధులు మంజూరు చేయించి అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని అన్నారు.
2011 ఉద్యమ సమయంలో ప్రజల అభీష్టం మేరకు టీడీపీకి రాజీనామా చేసి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు.అప్పటి నుంచి ప్రజలకు సేవ చేశానని అన్నారు. తనను గెలిపించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో ప్రభుత్వంలోకి వచ్చిందని.. తప్పకుండా అభినందిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అన్నారు. ప్రజలకు చెప్పి గెలిచారు కాబట్టి అవి అమలు చేయాలని అన్నారు. కామారెడ్డిలో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రజలకు రూ.150 కోట్ల విలువ గల మ్యానిఫెస్టోను విడుదల చేశారు అని అన్నారు. అందులో సూపర్స్పెషలిటీ దవాఖాన, మండల కేంద్రంలో జనరల్ దవాఖాన, రైతులకు కల్లాలు, పాఠశాలలను అవసరమైతే తన ఆస్తులను అమ్మి అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారని వాటిని అమలు పరచాలని అన్నారు.
దేశంలో ఏ నాయకుడు చేయని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీని తూచా తప్పకుండానెరవేర్చి నిజాయితీని చాటుకొని ప్రజల మన్ననలను పొందాలని అన్నారు.బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు. చిన్న చిన్న పొరపాట్లపై సమీక్షించుకొని కామారెడ్డిలో బీఆర్ఎస్ను ఎలా నిలబెట్టుకోవాలో సమీక్షించుకుంటామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిలదీస్తామన్నారు. మంచి చేస్తే స్వాగతిస్తామని అన్నారు. తనను 15 సంవత్సరాలుగా గెలిపించిన ప్రజలకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.