నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 8 : జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లాలోని శివాలయాలు వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట భక్తులు క్యూ కట్టారు.
భక్తులు అభిషేకాలు, పూజలు చేసి ఉపవాసదీక్షలు చేపట్టారు. శివలింగాలకు భక్తులు అభిషేకాలు చేసి పూజలు చేశారు. పలు ఆలయాల్లో వేదపండితుల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం చేపట్టారు. ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.