US water Crisis : అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఊహించని నీటి సంక్షోభం (Water Crisis) ముంచుకొస్తోంది. టెక్సాస్ రాష్ట్రం (Texas state) లోని కార్పస్ క్రిస్టీ (Corpus Christi) అనే నగరం తీవ్రమైన నీటి కొరతతో అల్లాడుతోంది. సుమారు 3 లక్షల మందికిపైగా జనాభా ఉన్న ఈ తీర ప్రాంత నగరం.. నీళ్లు పూర్తిగా అడుగంటిన తొలి నగరంగా నిలిచే ప్రమాదంలో ఉంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న కరవు, పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక అవసరాలు, కొత్త నీటి వనరుల అభివృద్ధిలో జాప్యం వంటివి ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ఈ నగరంలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరగడం నీటి కొరతను మరింత తీవ్రతరం చేసింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న భారీ పెట్రోకెమికల్ పరిశ్రమలకు అత్యధిక మొత్తంలో నీరు అవసరం అవుతోంది. వాతావరణ మార్పులవల్ల ఇప్పటికే తగ్గిపోయిన నీటి నిల్వలపై ఇది తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. నివేదికల ప్రకారం.. 2022లో నిర్మించిన ఒక ప్లాస్టిక్స్ కెమికల్ ప్లాంట్.. నగరంలోని ప్రజలందరూ కలిసి ఒక రోజులో వాడే నీటిని ఒక్కరోజే కూలింగ్ కోసం వినియోగిస్తోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్ను నిర్మించాలని ప్రణాళిక రచించారు. అయితే నిధుల కొరత, నియంత్రణ సంస్థల అనుమతులు, స్థానిక వ్యతిరేకతల కారణంగా ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి ఆలస్యమవుతూ వస్తోంది. మరోవైపు వాతావరణ మార్పులవల్ల టెక్సాస్లో తరచుగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో నగరానికి నీటిని సరఫరాచేసే కీలక రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.
‘ఇన్సైడ్ క్లైమేట్’ న్యూస్ జర్నలిస్ట్ డైలాన్ బడ్డౌర్ మాట్లాడుతూ.. అమెరికాలోని ఇతర నగరాలతో పోలిస్తే కార్పస్ క్రిస్టీ నీళ్లు అయిపోయే స్థితికి అత్యంత చేరువలో ఉందని అన్నారు. ఇటీవలి వర్షాలతో కొంత ఉపశమనం లభించినప్పటికీ నగరంలో కేవలం ఏడాదికి సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇది అత్యవసర పరిస్థితిగా పరిగణించాలని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం అధికారులు లోతైన భూగర్భ బావులు తవ్వడం, పరిశ్రమల కోసం వ్యర్థ జలాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
అయితే ఈ సంక్షోభం ప్రజల దైనందిన జీవితంపై ఇప్పటికే ప్రభావం చూపింది. ఇళ్లలో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు కడగడం వంటి వాటిపై కఠిన ఆంక్షలు విధించారు. పరిస్థితి మరింత దిగజారితే నీటి సరఫరాలో కోతలు లేదా పరిమిత గంటల్లో సరఫరా వంటి చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం కేవలం ఒక నగరానికే పరిమితం కాదని, పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులు, తగ్గిపోతున్న నీటి వనరుల మధ్య సమతుల్యం సాధించడంలో ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది ఒక హెచ్చరికగా నిలుస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.