దివ్యాంగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. సమైక్య పాలనలో నామమాత్రపు పింఛన్తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి సీఎం కేసీఆర్ మానవీయ పాలనలో ఆసరా దొరికింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇప్పటికే రూ.3016 పింఛన్ ఇస్తుండగా ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అడగకుండానే వారికి మరో రూ.వెయ్యి పెంచారు. పెంచిన పింఛన్ను ఈ నెల నుంచే పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెంచిన పింఛన్తో నిజామాబాద్ జిల్లాలో 19,152 మందికి, కామారెడ్డి జిల్లాలో 18,815 మందికి లబ్ధి చేకూరనున్నది. పింఛన్ పెంపుతో ఆదివారం పలు ప్రాంతాల్లో దివ్యాంగులు సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
కామారెడ్డి/ఖలీల్వాడి, జూలై 23 (నమస్తే తెలంగాణ) : సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ఆసరాగా నిలిచింది. శారీరక, మానసిక లోపంతో కుంగిపోతున్న వారికి పింఛన్ సమాజంలో మరింత గౌరవం పెంచింది. సమైక్య రాష్ట్రంలో దివ్యాంగులను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నామమాత్రపు పింఛన్ ఇచ్చి చేతులు దులుపుకున్నది. రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ అభాగ్యులకు ఆసరాగా నిలిచిచారు. నామమాత్రంగా ఉన్న పింఛన్ను రూ.1500 చొప్పున పెంచారు. 2019 ప్రథమార్థంలో దానిని రూ.3వేలకు పెంచారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇప్పుడు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏకంగా రూ. 4 వేలకు పెంచడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల నుంచే దీన్ని అమలు చేసేందుకు ఉత్తర్వులను జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 18,815 మంది దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తున్నారు. వీరికి ప్రస్తుతం రూ.3,016 చొప్పున మొత్తం రూ.5 కోట్ల 67లక్షల 46వేల 40 ప్రతినెలా అందజేస్తున్నారు. పింఛన్ను రూ.వెయ్యి పెంచడంతో ఒక్కొక్కరికి రూ.4,016 చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ.7కోట్ల 55లక్షల 61వేల 40 పంపిణీ చేయాల్సి వస్తుంది. ఈ లెక్కన ప్రతి నెలా అదనంగా రూ.కోటీ 87లక్షల 69వేలను అదనంగా అందజేయాల్సి ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 19,152 మంది దివ్యాంగులకు గాను రూ. 5.78 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నది.
రూ.1500 నుంచి రూ. 4వేల వరకు …
తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దివ్యాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ అందించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పింఛన్ను పెంచింది. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే పింఛన్ను డబుల్ చేసిన సీఎం కేసీఆర్ తాజాగా మరోమారు రూ.4,116 చొప్పున పింఛన్ అందించనున్నట్లు వెల్లడించారు. వేలాది మంది అభాగ్యులకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా మానవతా దృక్పథంతో వారికి కొండంత అండగా నిలిచారు.
దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం
కాగా ప్రతినెలా రూ.4,016 పింఛన్ అందజేయనుండడంతో దివ్యాంగులకు ఎంతో ఆసరాగా మారనున్నది. శారీరక, మానసిక దివ్యాంగులు వివిధ లోపాల కారణంగా ఏ పని చేయని పరిస్థితి ఉండేది. కానీ సీఎం కేసీఆర్ దివ్యాంగులకు అండగా నిలిచారు. పింఛన్ ఇవ్వడంతో పాటు ఉచిత బియ్యం ఇవ్వడంతో వారు సమాజంలో దర్జాగా బతుకుతున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
రామారెడ్డి జూలై 23 : మండలంలోని పోసానిపేట్ గ్రామంలో ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులు ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దివ్యాంగులను అక్కున చేర్చుకున్నారన్నారు. గత ప్రభుత్వాలేవీ దివ్యాంగులను పట్టించుకోలేదన్నారు. నామమాత్రంగా ఉన్న పింఛన్ను పెంచి ఆసరాగా నిలిచారన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల గ్రామశాఖ అధ్యక్షుడు మంగళి స్వామి, జిల్లా నాయకులు మేర రవి, పోతుల బాపురెడ్డి, చంద్రయ్య, దివ్యాంగులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసం పెరిగింది..
రామారెడ్డి : దివ్యాంగులకు పింఛన్ను పెంచుతూ జీవో విడుదల చేసిన సీఎం కేసీఆర్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. అభాగ్యులకు పింఛన్ పెంపు సీఎం కేసీఆర్ సార్ మానవీయ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నది. దివ్యాంగులకు ఆర్థిక భరోసానిస్త్తూ పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచడం హర్షణీయం. పింఛన్ పెంపుతో ఆర్థిక భారం అయినప్పటికీ మానవతా హృదయంతో నిర్ణయం తీసుకోవడంతో మాలో ఆత్మ గౌరవం ,ఆత్మ విశ్వాసం పెరిగింది.
-జంగం శ్రీశెలం, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంఘం ,కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు
గత పాలకులు పట్టించుకోలే..
దివ్యాంగుల సంక్షేమాన్ని గత పాలకులు పట్టించుకోలేదు నామ మాత్రంగా పింఛన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల బాగుకోసం చేస్తున్న కృషి చాలా సాహసోపేతమైనది. సీఎం కేసీఆర్ మా కుటుంబాలు తలెత్తుకొని బతికే విధంగా చేశారు. మళ్లీ కేసీఆర్ సారే సీఎం. జీవితాంతం సార్ వెంటే ఉంటాం.
-చాత్రబోయిన నరేందర్, రామారెడ్డి
మా బతుకులు బాగుపడ్డాయి..
సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగానే దివ్యాంగుల పింఛన్ను రూ.4016 చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్ హయాంలోనే మా బతుకులు బాగుపడుతున్నాయి. ఎవరి వద్ద చేయి చాచకుండా సగర్వంగా బతుకుతున్నాం. ఈ నెల నుంచే పెంచిన పింఛన్ డబ్బులు చేతికి అందనున్నాయి. చాలా సంతోషంగా ఉంది మాకు కనిపించే దైవం సీఎం కేసీఆర్.
-బాపురెడ్డి, పోసానిపేట్
సీఎం కేసీఆర్ దివ్యాంగుల గుండెల్లో ఉంటారు
బీర్కూర్ : దివ్యాంగుల పింఛన్ను రూ. 4016 పెంచిన సీఎం కేసీఆర్ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. గత ప్రభుత్వాలు మాటలు మాత్రమే చెప్పేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, ఎప్పటికప్పుడు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి మా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించా రు. ఇది మాటలు కాదు చేతల ప్రభుత్వమని నిరూపించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– కుమ్మరి సాయిలు, దివ్యాంగుల హక్కుల సమితి
కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు
దివ్యాంగుల కష్టం తెలిసినోడు సీఎం కేసీఆర్ సారు
నేను పుట్టినప్పటి నుంచి ఒక కాలు పనిచేయకపోవడంతో ఏ పని చేయలేకపోయేదాన్ని. అమ్మ, నాన్న కూలీ పని చేస్తూ నన్ను పోషించేవారు. ఏ పని చేయాలన్నా కాలు పనిచేయకపోవడంతో ఎవరూ పనిలో పెట్టుకునే వారు కాదు. సీఎం కేసీఆర్ మా పింఛన్లను పెంచడంతో మా కుటుంబంపై భారం లేకుండా పోయింది. మా కష్టం తెలిసిన సీఎం కేసీఆర్ సార్ పెన్షన్లను పెంచి మమ్ములను ఆదుకుంటున్నాడు.
-చిదరి సావిత్రి, బీర్కూర్
గర్వంగా బతుకుతున్నాం
సమాజంలో దివ్యాంగులమని అందరూ చిన్న చూపు చూసేవారు. దాంతోపాటు పేదరికంలో ఉండడంతో పలకరించేవారు సైతం ఉండేవారు కాదు. సీఎం కేసీఆర్ సారు అందిస్తున్న పింఛన్తో మా ఖర్చులకు ఒకరి వద్ద చేయి చాచే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరికైనా అవసరమైతే ఎంతో కొంత సహాయం చేయగలుగుతున్నాం. మాకు సమాజంలో ఇంత గుర్తింపు తెచ్చిన సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం సార్లను జీవితంలో మరిచిపోలేం.
-లింగం అమూల్య, కిష్టాపూర్
జీవితాంతం రుణపడి ఉంటాం
నా వయసు 22 సంవత్సరాలు. నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించకపోవడంతో అప్పట్లో ఎన్నో గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగినా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సదరం సర్టిఫికెట్తో పింఛన్లు ఇస్తున్నారని తెలిసి దరఖాస్తు చేసినా. వెంటనే పింఛన్ మంజూరైంది. ఇప్పుడు నేను కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నా. సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా పెండ్లి అయిన తర్వాత పుట్టబోయే పిల్లలకు సార్ పేరే పెట్టుకుంటా.
-బల్లెపు రాజు, బీర్కూర్