వర్ని, సెప్టెంబర్ 25 : అత్యధిక మందికి పింఛన్లు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమొక్కటేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలంలోని తగిలేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సక్రియానాయక్ తండాలో ప్రభుత్వం నిర్మించిన 20 డబుల్ బెడ్రూం ఇండ్లు, రూప్లానాయక్ తండాలో లబ్ధిదారులు నిర్మించుకున్న 20 వ్యక్తిగత బెడ్రూం ఇండ్లను ఆదివారం ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు, కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. పెన్షన్ల కోసం రూ.15 వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మోదీ ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్ రాష్ట్రంలో రూ. 1250 పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేశారు.
వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి కరెంటు బిల్లులు వసూలు చేయాలని తెలంగాణపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని, దీనిని అడ్డం పెట్టుకొని రాష్ర్టానికి రావాల్సిన రూ. 6 వేల కోట్లను మోదీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రైతులు, పేదల సంక్షేమానికి ప్రజాప్రతినిధులు కృషిచేయాలని సూచించారు. పలు మండలాల్లో కొందరు గ్రూపు రాజకీయాలు చేస్తూ ప్రభుత్వ, పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటివాటికి వెంటనే స్వస్తిచెప్పి ప్రతిఒక్కరూ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ కోట్లాది నిధులు మంజూరు చేస్తుంటే స్థానిక నాయకులు నాసిరకమైన పనులు చేయిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. తీరు మార్చుకొని అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని, నిస్వార్థంగా పేదల సంక్షేమానికి పాటుపడాలన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ బాన్సువాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, కో-ఆప్షన్ సభ్యుడు కరీం, హౌసింగ్ డీఈఈ నాగేశ్వరరావు, సర్పంచ్ మైసం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ బక్క నారాయణ, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో బషీరుద్దీన్, సొసైటీ చైర్మన్ సంజీవ్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, మాజీ సర్పంచ్ కీరీబాయి, అశోక్, ఉప సర్పంచ్ మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.