పిట్లం, డిసెంబర్ 4: బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన పిట్లం మండలపరిషత్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. శనివారం మండల కేంద్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును బీజేపీ నాయకులు అడ్డుకోవాలనుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలు ఉంటే పత్రికాముఖంగా తెలియజేయాలని సూచించారు.
ప్రజలకు సౌకర్యాలు కల్పించే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో మండలకేంద్రంలో కేంద్రప్రభుత్వం 30 పడకల దవాఖానను మంజూరు చేసినా నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. తమ వినతి మేరకు మంత్రి హరీశ్రావును కోరగా రూ.10.70 కోట్ల నిధులు మంజూరు చేసి భవన నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినట్లు వివరించారు. బిచ్కుందలో డయాలసిస్ సెంటర్, మద్నూర్ మండలంలో డోంగ్లీ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని గమనించకుండా బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. ఇది మరోసారి పునరావృతం అయితే సహించబోమని హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కేంద్రం ద్వారా నిధులు తెప్పించాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్, నాయకులు విజయ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, నర్సాగౌడ్, షఫీ, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, విండో చైర్మన్ శపథంరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.