నందిపేట్, మార్చి 19 : మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈనెల 26న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో అద్భుతమైన తెలంగాణ మోడల్ను సీఎం కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ రూపొందించిన 16 వీడియో స్క్రీన్ వాహనాలను ఆదివారం ఆయన కాందార్ లోహలో ప్రారంభించారు.
ఈ ప్రచార రథాలు మహారాష్ట్రలోని కాందార్ లోహ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 16 తాలూకాల్లో ఉన్న 1600 గ్రామాల్లో తిరుగుతాయని తెలిపారు. తెలంగాణ పథకాలపై మహారాష్ట్ర ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్పై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి, నాగనాథ గీస్వడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.