భీమ్గల్, నవంబర్ 19: తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల్లోనే పదిలంగా ఉంటుందని, రాష్ట్రంలో మరింత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన భీమ్గల్, ముప్కాల్ మండలాల్లో పర్యటించారు. భీమ్గల్ మండలంలోని సుదర్శన్నగర్ తండా, సంతోష్నగర్ తండా, జాగిర్యాల్, కుప్కల్, కుప్కల్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో వేములకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. చావునోట్లో తలపెట్టి కేసీఆర్ సాధించిన తెలంగాణ ఏర్పాటును తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై విషం కక్కారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అని చెప్పుకుంటున్న కిషన్రెడ్డి ..ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయాలని అడిగితే పారిపోయాడని ఎద్దేవా చేశారు.
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చంద్రబాబు శిష్యుడని అన్నారు. కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే ఢిల్లీకి, బీజేపీకి అధికారం అప్పగిస్తే గుజరాత్కు తెలంగాణను అప్పగిస్తారని అన్నారు. అదానీ, అంబానీలు వచ్చి మన భూములు లాక్కుంటారని హెచ్చరించారు. తెలంగాణ పచ్చగా మారి ఇక్కడి ప్రజలంతా బాగు పడుతున్న సందర్భాన్ని కొన్ని శక్తులు చూడలేకపోతున్నాయని మండిపడ్డారు. వరిధాన్యం సాగులో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని, గతంలో ఆంధ్ర ఉండేదన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో తాను వేయించిన డబుల్ రోడ్లను దండిగా పండిన ధాన్యంతో కల్లాలుగా వాడుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఇలా పచ్చగా ఉందనే వారికి కళ్లు మండుతున్నాయన్నారు. గిరిజన తండాలకు సైతం రోడ్లు వేయించానని ఎక్కడా లేని విధంగా కోటి రూపాయలతో తీజ్ భవనాలు, సేవాలాల్ ఆలయాలకు నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. తనను మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ మహేశ్, కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ గుణ్వీర్ రెడ్డి, జడ్పీటీసీ రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, మండల కన్వీనర్ శర్మనాయక్, భీమ్గల్ విండో చైర్మన్ నర్సయ్య, సర్పంచులు ఎంజీ నాయక్, శ్రీనివాస్, ఎంపీటీసీలు రాజేశ్వర్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేల్పూర్, నవంబర్ 19 : మంత్రి వేముల సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు భీమ్గల్ మండలం సికింద్రాపూర్, తండా, 11 గంటలకు గోన్గొప్పులు, తండా, సాయంత్రం 4 గంటలకు లింగాపూర్, 5 గంటలకు సిద్ధపల్లి, 6 గంటలకు బెజ్జొరా, 7.30 గంటకు ముచ్కూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ముప్కాల్, నవంబర్ 19 : కరెంటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ నాటి చీకటి రోజులు వస్తాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్, రెంజర్ల గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రజలకు చేసిందేమీలేదన్నారు. మహిళల తాగు నీటి కష్టాలు తీర్చే ఆలోచన చేయలేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కేవలం నాలుగున్నర సంవత్సరాల్లోనే మిషన భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేసి తాగు నీరు, కోతలు లేని కరెంటును అందించారని తెలిపారు. ఓటు వేసే ముందు ఇలాంటి విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక, బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు లేవన్నారు. ఇక్కడ ఆ పార్టీలు హామీ ఇస్తున్న పలు పథకాలు కర్ణాటక, మహారాష్ట్రలో లేవన్నారు. అక్కడ అమలు చేయని పథకాలు ఇక్కడ అమలు చేస్తామంటే ఎలా నమ్ముతామన్నారు.