ఎల్లారెడ్డి, జనవరి 24: దేశంలో అత్యధికంగా ఆహార ఉత్పత్తులను తెలంగాణలోనే పండిస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల టన్నుల వరి ధాన్యం కొనగోలు చేస్తే ఇందులో ఉమ్మడి నిజామాబాద్ నుంచి పది లక్షల టన్నులు ఉన్నదని తెలిపారు. వర్షాలు, ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్కారణంగా ప్రతి గుంటకూ సాగునీరు అందుతున్నదని వివరించారు.
ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించగా… ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఎన్ని రూ.కోట్ల ఆస్తి ఉన్న కోటీశ్వరులకైనా అన్నం పెట్టేది రైతు మాత్రమే అని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు వ్యవసాయం దండగా అన్నారని, స్వరాష్ట్రంలో ఇప్పుడు కోటీ 53 లక్షల ఎకరాల్లో పంటలను సాగుచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగు విస్తీర్ణం ఐదింతలు పెరిగిందన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని, ఇతర రాష్ర్టాల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవని సభాపతి తెలిపారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించిన పార్టీ రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో వ్యవసాయం ఇప్పుడు పండుగలా మారిందన్నారు. మార్కెట్ కమిటీ పాలక వర్గం రైతులకు అండగా ఉండాలని సూచించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్గా కాశీ నారాయణ, వైస్ చైర్మన్గా సిద్దిరాంరెడ్డి, డైరెక్టర్లు పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ జిల్లా మేనేజర్ రమ్య, కార్యదర్శి దూందా, నాయకులు ప్రతాప్ రెడ్డి, సత్యం రావు, తానాజీరావ్, జలెంధర్ రెడ్డి, ఆకుల బాగయ్య, కుడుముల సత్యం, శివాజీ రావు, ముఖుంద్ రావ్, ఎంపీపీ మాధవి, జడ్పీటీసీలు ఉషాగౌడ్, మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
‘డబుల్’ఇంటిని ప్రారంభించిన సభాపతి
బీర్కూర్, జనవరి 24: మండలంలోని బీర్కూర్తండాలో డబుల్ బెడ్ రూం ఇంటిని సభాపతి పోచారం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, దేవుని దయతో బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల ఇండ్లు మంజూరవగా,ఇందులో 2200 ఇండ్లను గిరిజన తండాలకు కేటాయించి, నిర్మాణ పనులను పూర్తిచేశామని వివరించారు.