కామారెడ్డి, జూన్ 18 (నమస్తే తెలంగాణ):మెరుగైన వాతావరణం, రేపటి మనందరి భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన పథకమే తెలంగాణకు హరితహారం. రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 24శాతం నుంచి 33శాతానికి పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2015లో ప్రారంభించిన హరితహారం ఇప్పటి వరకు ఎనిమిది విడుతలను పూర్తి చేసుకున్నది. అడవుల విస్తీర్ణం, పచ్చదనం పెంపొందించడమే ఆశయంగా వివిధ ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేశారు. అటవీ, పంచాయతీరాజ్, పురపాలక తదితర శాఖల సమన్వయంతో ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాలు, చెరువు, పొలం గట్లు, రోడ్ల వెంబడి మొక్కలను నాటి చక్కగా సంరక్షిస్తున్నారు. ఎనిమిది విడుతల్లో చేసిన కృషి ఫలితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హరితశోభను సంతరించుకున్నది. పల్లె, పట్టణాలన్నీ పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయి. రోడ్లు, జాతీయ రహదారుల వెంట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. ఇవన్నీ హరితహారం ఫలితాలే.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు(సోమవారం) నిర్వహించనున్న తెలంగాణ హరితోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
హరిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది విడుతలుగా పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం కార్యక్రమం ఫలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పల్లెలతోపాటు పట్టణాలు సైతం పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. గతంలో నగరాలకే పరిమితమైన పార్కులు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇప్పుడు పల్లెల్లోనూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎటుచూసినా పచ్చదనం సంతరించుకున్నది. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, రోడ్ల వెంబడి చెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో పచ్చదనం కనిపిస్తున్నది. హరితహారంలో భాగంగా తొమ్మిదేండ్లలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు కోటీ20 లక్షల మొక్కలను నాటారు. ఒక్కో నియోజకవర్గంలో 30 లక్షల వరకు మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 40వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టారు. అందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేశారు. మొక్కల్లో టేకు, చింత, సుబాబుల్, మామిడి, జామ తదితర రకాలు ఉన్నాయి.
కామారెడ్డిలో లక్ష్యానికి మించి…
తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా 2021-22 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో 28.10 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యం నిర్దేశించగా 26.70 లక్షల మొక్కలను నాటి పెంచారు. 2022-23లో 32.56 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 44.4లక్షలు (130శాతం) మొక్కలను నాటారు. వీటిలో 20.07 లక్షలు డీఆర్డీవో లక్ష్యం కాగా నేటి వరకు 22.80 లక్షలు (113శాతం) మొక్కలను నాటారు. అటవీ శాఖకు 3లక్షల లక్ష్యం కాగా 12.74 లక్షల మొక్కలను నాటి (424శాతం) ప్రగతిని సాధించారు. 44వ నంబర్ జాతీయ రహదారి వెంట 53 కిలోమీటర్ల మేర మొక్కలను నాటి సంరక్షించారు. వన్యప్రాణులు, ఇతర జంతువుల కోసం, అటవీ భూముల్లో అధికంగా గడ్డిని అభివృద్ధి పర్చేందుకు విత్తనాలను వేశారు. పోచారం ఏరియాలో 10 గ్రాస్ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా జిల్లాలో 311 సాసర్పిట్లను నిర్మించారు. క్షీణించిన అడవుల పునరుద్ధరణలో భాగంగా 1050 హెక్టార్లలో ఈ సంవత్సరం అడ్వాన్స్ ఆపరేషన్ ఫర్ ప్లాంట్లో భాగంగా మొక్కలను నాటారు. నాటిన మొక్కల వివరాలను పరిశీలిస్తే బండ్ ప్లాంటేషన్ 1.49 లక్షలు, బంబునాలా 40వేలు, మెడికినల్, ఎస్జీటీఎస్ 52వేలు, బ్లాక్ ప్లాంటేషన్ 4.86 లక్షలు, ఫ్రూట్ బేరింగ్ 22వేలు, గ్యాప్ ప్లాంటేషన్ 1.97లక్షలు, లీనియర్ ప్లాంటేషన్ 2.88 లక్షలు, ఇతర మొక్కలు 40వేలు నాటారు. పలు గ్రామాల్లో కోతుల ఆహార కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
హరితహారంతో పచ్చదనం పెరిగింది
గాంధారి, జూన్ 18: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పచ్చదనం సంతరించుకున్నది. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. రోడ్డు వెంట వెళ్లేవారికి ఒకవైపు చల్లని నీడనిస్తుండడంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తున్నాయి.
– తూర్పు సంతోష్, గాంధారి
చల్లని నీడనిస్తున్నాయి..
హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి చల్లని నీడనిస్తున్నాయి. ఒకప్పుడు అశోకుడు మొక్కలు నాటించాడని పుస్తకాల్లో చదువుకున్నాం. ప్రస్తు తం హరితహారం కార్యక్రమంతో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించిన సీఎం కేసీఆర్ని కండ్లారా చూస్తున్నాం.
– శ్రీనివాస్ నాయక్, కర్ణంగడ్డ తండా, గాంధారి
పచ్చని వనాలుగా గ్రామాలు..
నాగిరెడ్డిపేట్, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంతో గ్రామాలన్నీ పచ్చని వనాలుగా మారాయి. మా ఊర్లో ప్రతి సంవత్సరం మొక్కలు నాటు తూ వాటిని సంరక్షిస్తుండడంతో ఇప్పుడవి చెట్లుగా మారాయి. కాలనీలతోపాటు రోడ్లకు ఇరువైపులా పచ్చని తోరణంలా కనిపిస్తున్నాయి. మొక్కలు పెరగడంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి.
– షరీఫ్, గోలిలింగాల్ (నాగిరెడ్డిపేట)
సీఎం కేసీఆర్ సార్ మంచి పని చేసిండు..
నాగిరెడ్డిపేట్, జూన్ 18: తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సారు మొక్కలు నాటుడు కార్యక్రమం మొ దలు వెట్టిండు. ఇప్పటి వరకు ఎనిమిది మార్లు మొక్కలు నాటినం. మా ఊర్లో పల్లె ప్రకృతి వనం, నర్సరీని పెట్టిండ్రు. గతంలో నాటిన మొక్కలన్నీ ఏపుగా పెరగడంతో ఊరంతా చెట్లే కనిపిస్తున్నాయి. మంచి వాతావరణం కోసం సీఎం కేసీఆర్ చాలా మంచి పని చేసిండు. ఆయనకు రుణపడి ఉంటాం.
– సాయిలు, గోపాల్పేట్ (నాగిరెడ్డిపేట)
ఎటు చూసినా చెట్లే…
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పల్లె, పట్టణాలన్నీ ఆకుపచ్చగా మారాయి. దీంతో ఎటు చూసినా చెట్లే కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో గ్రామస్తులు సేదతీరుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం కృషితో అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలు ఏర్పాటయ్యాయి.
– దేశ్ముఖ్ వెంకటరమణారావు, సర్పంచ్,కోనాపూర్ (బాన్సువాడ)