కమ్మర్పల్లి/ వేల్పూర్, సెప్టెంబర్ 9 : రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గాల ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో మంత్రి వేముల మాట్లాడుతూ.. బాల్కొండ నియోజక వర్గంలో తాను 24 చెక్డ్యామ్లు మంజూరు చేయించి ఇందులో 16 పూర్తి చేయించినట్లు తెలిపారు. 16 విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించినట్లు చెప్పారు. ఇందుకు ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. ఏఎంసీ నూతన పాలక వర్గాలు రైతులకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరుతెచ్చుకోవాలని సూచించారు. కష్టపడే టీఆర్ఎస్ కార్యకర్తలకు సందర్భాన్ని బట్టి పదవులు తప్పక వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలపై గజినీ మహమ్మద్ కన్నా దుర్మార్గంగా దాడులు చేస్తోందన్నారు. అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తున్న మోదీ ఇక వ్యవసాయం మీద పడ్డారని ఆరోపించారు. మోటర్లకు మీటర్లు పెట్టి వ్యవసాయాన్ని అదానీ, అంబానీలకు అప్పజెప్పే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దేశానికి అధోగతి పట్టిస్తున్న మోదీ సర్కారును గద్దె దించడానికి బయల్దేరిన కేసీఆర్ను అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఉచిత పథకాలు వద్దంటున్న మోదీ..
రైతులు, పేదలకు ఇచ్చే ఉచిత పథకాలను మోదీ ప్రభు త్వం వద్దంటున్నదని అన్నారు. కానీ వారికి నచ్చిన వా రికి మాత్రం అన్ని కట్టబెడుతున్నదని మంత్రి మండిపడ్డారు. మన రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గుజరాత్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. దేశానికి మోడల్ అని చెప్పిన మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పెన్షన్ 750 ఇస్తే..ఇక్కడ కేసీఆర్ రూ. రెండు వేలు ఇస్తున్నారని తెలిపారు. అక్కడ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ లేదన్నారు. మాటకు గుజరాత్ మోడల్ అంటున్న బీజేపీ నేతలు తెలంగాణలో కూడా అక్కడి మాదిరిగా రూ. 750 పెన్షన్ ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు, రైతులు దీనిపై ఆలోచన చేయాలని సూచించారు. బీజేపీ మోసాలను గమనించాలని కోరారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని..కానీ కేసీఆర్ అందుకు ఒప్పుకోవడంలేదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ మిత్రులకు పదకొండున్నర లక్షల కోట్లు మాఫీ చేశారని, పేదలకు మాత్రం అన్ని రేట్లు పెంచుతున్నారని విమర్శించారు.
కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టుడు తప్ప, వారితో ఒరిగిందేమీ లేదన్నారు. వారిని ప్రశ్నించేందుకు కేసీఆర్ బయల్దేరారని, యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. కేసీఆర్కు మద్దతుగా నిలువాలని కోరారు. కేసీఆర్ వచ్చిన తర్వాత వచ్చిన మార్పుపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని పిలునిచ్చారు. అనంతరం నూతనంగా ఎంపికైన వేల్పూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు బోల్లపల్లి అరుణ, వైస్ చైర్మన్ నల్ల రమేశ్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపికైన గుణ్వీర్రెడ్డి, వైస్ చైర్మన్ పాపాయి పవన్, పాలకవర్గ సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను మంత్రి సన్మానించారు. వేల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్ ఎంపీపీ బోదపల్లి సురేశ్, ఎంపీటీసీలు, సర్పంచులు, కమ్మర్పల్లి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీపీ గౌతమి, కమ్మర్పల్లి ఏఎంసీ డైరెక్టర్లు చెప్పల లయ, సీతారాం, వి.శ్రీనివాస్ రెడ్డి, బోడ దేవేందర్, ఎన్.అనిల్ రెడ్డి, ఎం.దేవన్న, కే.చిన్న రాజేశ్వర్, ఎండి.యూసుఫుద్దీన్, కె.రామాగౌడ్, ఎస్.శ్రీనివాస్, జె.భూమయ్య, జి.కిషన్, ఎస్.బాపురెడ్డి, గడ్డం స్వామి, డీఎంవో ఎస్.గంగు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్లు దొన్కంటి నర్సయ్య, మలావత్ ప్రకాశ్, మోర్తాడ్, భీమ్గల్, ఏర్గట్ల ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.