న్యూఢిల్లీ, జూలై 30: పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులను నివారించేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ చేసినప్పటికీ రాజ్యసభలో మూజువాణి ఓటుతో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును ఆమోదించారు.
కాగా, సవరించిన ఈ బిల్లు ప్రకారం పరీక్ష పేపర్ల లీక్కు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తారు. పేపర్ల లీక్లు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కనీసం 5 ఏండ్లు, గరిష్ఠంగా 10 ఏండ్లు కారాగార శిక్ష విధిస్తారు. దీనితో పాటు రూ. 50 లక్షల జరిమానా విధిస్తారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారికి ఏడేండ్ల కనీస శిక్షతో పాటు రూ.10 కోట్ల జరిమానా విధిస్తారు.
సభ నుంచి అమిత్ షా గైర్హాజర్ కావడం పట్ల కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20న విద్యార్థులు నిర్వహించిన ఆందోళనపై మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు. మాట్లాడకుండా మీ నోటిని ఎవరైనా కుట్టేశారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. ‘మీరు ఈ దేశ హోం మంత్రి. ఇది మన రాజధాని ఢిల్లీలో జరిగింది. అయినప్పటికీ మీరు నోరు తెరువడం లేదు. ఎవరైనా మీ నోటిని కుట్టేశారా?’ అని అన్నారు.