గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కులవృత్తులే ఆధారం. కానీ, ఆధునిక, సాంకేతిక యుగంలో ఎదురైన సవాళ్లతో అవి సంక్షోభంలో చిక్కుకున్నాయి. సరైన సహకారం లేక వాటి మనుగడే ప్రశ్నార్థకమైంది. కులవృత్తులు అంతరించి పోయే దశలో కేసీఆర్ సర్కారు వాటి బలోపేతానికి చర్యలు చేపట్టింది. నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత కరెంటును అందిస్తున్నది. రజకులకు ధోబీఘాట్లు నిర్మించింది. లాండ్రీ షాపులకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయా కులవృత్తులు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. ఫలితంగా కుంటుపడిన గ్రామీణ వ్యవస్థ మళ్లీ గాడిన పడింది. వారసత్వంగా వచ్చిన పనిపై ఆధారపడిన వారు ఆర్థికంగా ఎదుగుతున్నారు. అన్ని కులాలకు చేయూతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బడుగు బలహీనవర్గాల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నది.
ధర్పల్లి/బిచ్కుంద/ఎడపల్లి, నవంబర్ 9 : అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిన తెలంగాణ సర్కారు.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంలోనూ ముందున్నది. కులవృత్తులే జీవనాధారంగా బతుకు సాగిస్తున్న కుటుంబాలన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాయి. నిరాదరణతోపాటు ఈ శ్రమ జీవులకు పోత్స్రాహం కరువై కూలీలుగా మారారు. కుటుంబ పోషణ కోసం అనేకమంది వలసబాటపట్టారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాక స్వరాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చింది. కేసీఆర్ సర్కారు అన్ని వర్గాలవారికి వివిధ సంక్షేమ పథకాలను అందజేస్తూ బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపింది.
అప్పట్లో సగం కరెంటు బిల్లుకే పోయేవి..
నేను 13ఏండ్లుగా లాండ్రీ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. నెల మొత్తం సంపాదించిన దాంట్లో సగం పైసలు కరెంటు బిల్లు కట్టడానికే సరిపోయేవి. దాదాపు 3వేల వరకు కరెంటు బిల్లు కట్టేవాడిని. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. ఇప్పుడు ప్రతినెలా రూ.3వేలు ఆదా అవుతున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది.
– చాకలి మల్లెపూల సాయిలు, ఎడపల్లి
సెలూన్లకు ఉచిత కరెంటు..
కులవృత్తులపైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఇందులో భాగంగా వారివారి వృత్తికి అనుగుణంగా వివిధ సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. సెలూన్లు నిర్వహించే నాయీ బ్రాహ్మణుల కష్టార్జితం అంతా కరెంటు బిల్లులకే సరిపోతున్నది. వారికి విద్యుత్ బిల్లులు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఏడాది క్రితం మీటర్లను ఏర్పాటు చేయించి చేయూతనందించింది. క్షౌరశాల నిర్వహణలో ప్రధాన వ్యయం అయిన కరెంటు బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నది. దీంతో వారి కష్టార్జితం పూర్తిగా చేతికే అందడంతో మురిసిపోతున్నారు. తమ బతుకులు మళ్లీ గాడిన పడ్డాయని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఉచితంగా కరెంటును సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అంటున్నారు.
– అశోక్, కటింగ్ షాపు ఓనర్, రేకులపల్లి
లాండ్రీ దుకాణాలకు..
రజకులు ఒకప్పుడు చెరువులకు వెళ్లి బట్టలు ఉతికి తెచ్చేవారు. బొగ్గును వినియోగించి బట్టలను ఇస్త్రీ చేసేవారు. ఇప్పడు ఆ రోజులు పోయాయి. కరెంటుతో నడిచే వాషింగ్ మిషన్లు, ఐరన్ బాక్సులు అందుబాటులోకి వచ్చాయి. కులవృత్తిపైనే జీవనం సాగించేవారంతా ఇప్పుడు వీటినే వినియోగిస్తున్నారు. కానీ కరెంటు మీటర్లు గిర్రున తిరగడంతో వారు చెమటోడ్చి సంపాదించిన డబ్బులన్నీ బిల్లులకే సరిపోతున్నాయి. రజకుల కష్టం వారి కుటుంబ సభ్యుల కడుపు నింపడంలేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. కరెంటు బిల్లులను మాఫీ చేస్తున్నది. వారు నిర్వహించే దుకాణాలకు ఇప్పటికే మీటర్లను ఏర్పాటుచేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. నెలనెలా వచ్చే బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో వారి రోజువారీ సంపాదన అంతా ఇంటికే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దుర్భర పరిస్థితుల నుంచి గట్టెక్కి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. తరతరాలుగా చాకిరీ చేస్తున్న తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ను నిండు మనస్సుతో దీవిస్తున్నారు.
– చాకలి సాయిలు, బిచ్కుందలో ఇస్త్రీ దుకాణ నిర్వహకుడు
ఉచిత కరెంటుతో కొండంత అండ..
సీఎం కేసీఆర్ పేదల బతుకులను అర్థం చేసుకొని సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు. మా షాపులకు ఉచితంగా కరెంటు మీటర్లను పెటించారు. విద్యుత్ బిల్లులను సైతం మాఫీ చేయడం సంతోషకరం. లేదంటే మేం రోజంతా పనిచేసిన డబ్బులు సెలూన్ల నిర్వహణకే సరిపోయేవి. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యంతో మా కష్టమంతా చేతికే అందుతున్నది. ఆర్థిక కష్టాలనుంచి దూరమై.. మా కుటుంబాలను బాగా చూసుకుంటున్నాం. కొంత ఎక్కువ కష్టపడుతూ నాలుగు పైసలు కూడా వెనుకేసుకుంటున్నాం.
– దుబ్బాక సురేశ్, క్షౌరశాల నిర్వాహకుడు, ధర్పల్లి
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
సెలూన్ల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మీటర్లు పెట్టించింది. కరెంటు బిల్లులను కూడా మాఫీ చేయడం ఆనందంగా ఉంది. ఇది మాలాంటి పేదవారికి ఎంతో లబ్ధి చేకూరుతున్నది. మాకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. నాయీ బ్రాహ్మణుల కుటుంబాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ రుణపడి ఉంటాయి. కులవృత్తితో ఉపాధి పొందే యువతను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై రుణాలు అందించాలి.
– అశోక్, నాయీబ్రాహ్మణుడు, రేకులపల్లి
కష్టమంతా చేతికే వస్తున్నది..
మా ముందు తరం వాళ్లు బొగ్గుల పెట్టెతో ఇస్త్రీ చేసేవారు. ఇప్పుడు చాలామంది కరెంటుతో నడిచే ఐరన్ బాక్సులను వాడుతున్నాం. రోజుకు రూ.500 సంపాదిస్తే.. అందులో ఎక్కువ భాగం కరెంటు బిల్లులకే పోయేది. ఏడాది క్రితం లాండ్రీ షాపులకు రాష్ట్ర సర్కారు ఉచితంగా కరెంటు మీటర్లను పెట్టింది. బిల్లులను కూడా మాఫీ చేస్తున్నారు. దీంతో రోజూ కష్టపడే డబ్బులు చేతికే అందుతున్నాయి. నెలకు కనీసం రూ. 15వేల దాకా సంపాదిస్తున్నాం. మా బతుకులను బాగు చేసిన సీఎం కేసీఆర్ను జీవితాంతం గుర్తుంచుకుంటాం.
– చాకలి సాయిలు, లాండ్రీ నిర్వాహకుడు, బిచ్కుంద