నిజామాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్.. జై కిసాన్.. జై కేసీఆర్.. దేశ్కి నేత కేసీఆర్’ నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని కంధార్ లోహలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. లక్ష మందికిపైగా ప్రజలు తరలివచ్చారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన బీజేపీపై పోరుకు సిద్ధమైన సీఎం కేసీఆర్కు మహారాష్ట్రలో ఎనలేని ఆదరణ లభిస్తున్నది. సభలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను.. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో తీసుకురానున్న మార్పులపై సీఎం కేసీఆర్ కండ్లకు కట్టినట్లు మరాఠా ప్రజలకు తనదైన శైలిలో విడమరిచి చెప్పారు. సభకు హాజరైన అశేష జనం అడుగడుగునా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకుంటూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీని తరిమి కొట్టేందుకు సిద్ధమైన సీఎం కేసీఆర్కు మహారాష్ట్రలో ఎనలేని ఆదరణ లభిస్తున్నది. బీజేపీ నిరంకుశ రాజకీయ క్రీడపై మండిపడుతున్న ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీ పెద్దలను ప్రజాస్వామ్యబద్ధంగా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్గా మారిన ఉద్యమ పార్టీ నేడు జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నేలకు దించి దేశ ప్రజలకు సుభిక్షమైన పరిపాలనను అందించడమే లక్ష్యంగా కేసీఆర్ వేస్తున్న అడుగులపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘దేశ్కీ నేత కేసీఆర్’ అంటూ ప్రజలంతా నినదిస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. గులాబీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో కేసీఆర్ జాతీయ ప్రస్థానాన్ని స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన నాందేడ్, కంధార్ లోహ సభలు దిగ్విజయం కాగా, రోజురోజుకూ మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నది.
కేసీఆరే సరైనోడు..
మహామహులను కన్న మనదేశ కీర్తి ఘనమైనది. కానీ నేటి పాలకుల పుణ్యమా అని ఇప్పుడు ప్రమాదపు అంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి నినాదం ప్రజలకు దూరమై తొమ్మిదేండ్లు అవుతున్నది. దేశం మళ్లీ ప్రగతిబాట పట్టి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే సరైన నాయకుడు కావాలి. సత్తా ఉన్న నాయకుడి కోసం దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ప్రజలకు అందాల్సిన ఫలాలు, ప్రయోజనాలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి ప్రధాని మోదీ పండుగ చేసుకుంటున్నారు. పేదరిక నిర్మూలన, సహజ వనరుల వినియోగం, ప్రజల జీవితాల్లో మార్పు, అన్ని రంగాల్లో సమూల మార్పులు జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లుగా సమాజం గుర్తిస్తుంది. దేశం బాగుపడినట్లు అర్థమవుతుంది. కానీ నేడు దేశంలో పేదలు ఇంకా దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారు. దేశ సంపద పెంచాలి.. పేదలకు పంచాలనేది కేసీఆర్ నినాదం. కానీ మోదీ ప్రభుత్వం పేదల సంపదను దోచి కార్పొరేట్ శక్తులకు పంచి పెడుతున్నది. ఇప్పుడు కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరమని ప్రజలు భావిస్తున్నారు.
కేసీఆర్ స్పీచ్పై హర్షాతిరేకాలు..
దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అరాచకాలపై ప్రజల్లో ఛీత్కార భావం పెరుగుతున్నది. తమను తిరస్కరించిన రాష్ర్టాల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని బీజేపీ కుట్రలు పన్నుతున్నది. ఇందుకోసం అధికార పార్టీల్లో ఉన్న నాయకులకు డబ్బును ఎరగా చూపెడుతున్నది. దేశ వ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న విధానం ఇదే. లేదంటే ఈడీ, సీబీఐ దాడులతో లొంగదీసుకునే ప్రయత్నం చేయడంపై సర్వత్రా చర్చకు దారి తీస్తున్నది. మోదీ నాయకత్వంలోనీ బీజేపీ పాలనా విధానాన్ని ఒకసారి పరిశీలించిన వారంతా ఇప్పుడు దుమ్మెత్తి పోయడం తప్ప ఇంకోటి చేయడం లేదు. సామాన్యుడు బతకకుండా నిత్యావసరాల ధరలను పెంచడం వంటి చర్యలతో అనతి కాలంలోనే మోదీపై వ్యతిరేకత పెరిగింది. కందార్ లోహ సభలో బీఆర్ఎస్ అధినేత అనర్గళంగా, తనదైన శైలిలో కేసీఆర్ ప్రసంగానికి అడుగడుగునా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సభకు హాజరైన వారంతా చప్పట్లు కొడుతూ అభినందించారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలను కండ్లకు కట్టినట్లు విడమరచి చెప్పడంతో మరాఠా ప్రజలు ఆలోచనలో పడ్డారు. భిన్నమైన దారుల్లో నడుస్తున్న దేశ స్థితిగతులను మార్చడానికి, దారి చూపేందుకు తానే జాతీయ రాజకీయాల్లోకి వచ్చానంటూ చెప్పడంతో సభకు హాజరైనవారంతా సంతోషం వ్యక్తం చేశారు.